
అఫ్గానిస్థాన్లో సిక్కుల ప్రార్థనా మందిరం గురుద్వారాపై ఇటీవల జరిపిన దాడిలో సూత్రధారిగా భావిస్తున్న ఐసిస్ ఉగ్రవాది అబ్దుల్లా ఒరఖ్జాయ్ అలియాస్ అస్లాం ఫరూకీని అఫ్గాన్ నిఘా వర్గాలు అరెస్టు చేశాయి. ఇతడికి పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు గుర్తించారు. ఐసిస్లోని ఖొరాసన్ విభాగానికి అబ్దుల్లా ప్రస్తుతం నేతృత్వం వహిస్తున్నాడు. అఫ్గాన్ దక్షిణ ప్రాంతంలోని కాందహార్ ప్రావిన్సులో నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ(ఎన్డీఎస్) జరిపిన ఓ ఆపరేషన్లో శనివారం ఇతడు పట్టుబడ్డట్లు అక్కడి ప్రముఖ మీడియా సంస్థ ‘టోలో న్యూస్’ పేర్కొంది. ఇతనితో పాటు మరో 19 మంది ఉగ్రవాదుల్ని కూడా అదుపులోకి తీసుకున్నట్లు ఎన్డీఎస్ తెలిపింది. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న హక్కానీ నెట్వర్క్, లష్కరే తోయిబాతో వీరందరికీ సంబంధాలు ఉన్నట్లు గుర్తించింది.
అబ్దుల్లాను అఫ్గానిస్థాన్ షాడో గవర్నర్గా ఐసిస్ నియమించినట్లు ఎన్డీఎస్ పేర్కొంది. ఐసిస్ మిలిటరీ పెషావర్ విభాగంలో కమాండర్గానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు తెలిపింది. గత నెల కాబూల్లోని గురుద్వారాపై జరిపిన దాడికి సూత్రధారి అబ్దుల్లాయే అని ఎన్డీఎస్కు చెందిన ఓ అధికారి తెలిపారు. పాక్కు చెందిన ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు విచారణలో అతడు అంగీకరించినట్లు వెల్లడించారు.
అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్లోని గురుద్వారాలో ఉగ్రవాదులు గత నెల 25న విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 27 మంది మృతి చెందారు. వీరిలో దిల్లీకి చెందిన తియాన్ సింగ్ కూడా ఉన్నట్లు గుర్తించారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. దాడి అనంతరం భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు ముష్కరులు హతమయ్యారు. ఈ దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. దీనిపై జాతీయ నిఘా సంస్థ(ఎన్ఐఏ) తొలిసారి ఓ ఓవర్సీస్ కేసు నమోదు చేసింది. కేరళలోని కాసర్గోడ్ జిల్లాకు చెందిన మహ్మద్ ముహ్సిన్(28)కు కూడా కాబూల్ దాడితో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు ప్రాథమిక విచారణ అనంతరం ఎన్ఐఏ అధికార ప్రతినిధి ఇటీవల తెలిపారు.