News

తిరుమల ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని మరింత మెరుగ్గా పరిచయం చేసేలా ఏర్పాట్లు

2views

తిరుమల పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తిరుమల, తిరుపతి అభివృద్ధి, భక్తుల సౌకర్యాలు, పర్యావరణ పరిరక్షణపై కీలక ప్రకటనలు చేశారు. భక్తులకు మెరుగైన భద్రత, రవాణా, వైద్య సదుపాయాలతో పాటు ఆలయాల నిర్మాణం, అన్నప్రసాదం, పచ్చదనం, సోలార్ విద్యుత్, ఉద్యోగుల గృహ వసతి వంటి పలు అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. 1996లో ప్రారంభించిన టీటీడీ మ్యూజియాన్ని ఆధునికీకరించినట్లు చంద్రబాబు తెలిపారు. మ్యూజియం నిర్వహణ బాధ్యతలను టాటా ట్రస్ట్‌కు అప్పగిస్తున్నట్లు చెప్పారు. భక్తులకు తిరుమల ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని మరింత మెరుగ్గా పరిచయం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఇక, తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికి భద్రత కల్పించే ఉద్దేశంతో ఎల్‌ఐసీతో ఒప్పందం చేసుకున్నట్లు సీఎం తెలిపారు. సాధారణ భక్తులు కూడా స్వామివారి నామస్మరణతో ప్రశాంతంగా ధ్యానం చేసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయడంపై అధ్యయనం చేస్తున్నామని చెప్పారు.

ఎలక్ట్రిక్ బస్సులతో రవాణా సౌకర్యం
భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చంద్రబాబు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ తిరుమలలో గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. జూన్ 2026లో తిరుమల పర్యటన సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ టీటీడీకి 25 ఎలక్ట్రిక్ బస్సులను అందజేస్తామని హామీ ఇచ్చారు. పర్యావరణహిత రవాణాను ప్రోత్సహించే దిశగా ఈ సహకారం ఉంటుందని అప్పట్లో ప్రకటించారు. తాజాగా ఆ హామీ మేరకు ఎలక్ట్రిక్ బస్సులను టీటీడీకి అందించారు.. ఆ బస్సులను ఈ రోజు సీఎం చంద్రబాబు ప్రారంభించారు..

శ్రీవాణి ట్రస్టు నిధులతో 5 వేల ఆలయాలు
శ్రీవాణి ట్రస్టు నిధులతో సుమారు 5 వేల ఆలయాలను నిర్మించే కార్యక్రమం చేపడుతున్నట్లు చంద్రబాబు తెలిపారు. రూ.20 లక్షలు, రూ.30 లక్షలు, రూ.50 లక్షల వ్యయంతో వివిధ స్థాయిల్లో ఆలయాల నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. నియోజకవర్గ స్థాయిలో రూ.10 కోట్ల వ్యయంతో ఆలయాల నిర్మాణానికి ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం జరగాలన్నది లక్ష్యంగా వివరించారు. ఇక, అన్నప్రసాదం ట్రస్టుకు రూ.3,167 కోట్ల కార్పస్ ఫండ్ ఉందని తెలిపారు. అన్నప్రసాదంలో నాణ్యత ప్రమాణాలను మరింత పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. టీటీడీ అధికారిక సమాచారం ప్రకారం ప్రస్తుతం తిరుమల, తిరుపతి, తిరుచానూరులోని పలు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో భక్తులకు అన్నప్రసాదం అందిస్తున్నారు.

వైద్య సేవలను మరింత విస్తరణ
ప్రాణదానం, బర్డ్స్, సర్వశ్రేష్ఠ ట్రస్టుల్లో కలిపి రూ.1,500 కోట్ల కార్పస్ ఫండ్ ఉందని సీఎం తెలిపారు. టీటీడీ పరిధిలోని అన్ని ఆసుపత్రులను అనుసంధానం చేసి ‘శ్రీవారి వైద్య సేవ’ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య చికిత్స అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు.. శ్రీవారి సేవలో ఇప్పటివరకు 12 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చంద్రబాబు వెల్లడించారు.. సేవకులకు ప్రత్యేకంగా శిక్షణ అందించి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక, ‘వృక్షో గోవిందం’ పేరుతో చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని సీఎం ప్రకటించారు. తిరుమలలో ఇప్పటికే 89 శాతం పచ్చదనం ఉందని తెలిపారు. హెర్బల్ ప్లాంటేషన్‌ను కూడా ప్రోత్సహిస్తామని చెప్పారు. తిరుమలను వ్యర్థాలు లేని, జీరో పొల్యూషన్ కేంద్రంగా మార్చే దిశగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

తిరుపతిలో స్కైవాక్, ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్
తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్ మార్గాన్ని అనుసంధానం చేస్తూ స్కైవాక్ నిర్మాణం చేపట్టనున్నట్లు చంద్రబాబు తెలిపారు. తిరుపతిలో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ నిర్మాణాన్ని కూడా చేపడతామని చెప్పారు. టీటీడీ ఉద్యోగులకు కేటాయించిన 5,192 ఇంటి స్థలాల ప్రాంతాన్ని రూ.230 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు.. ఇందులో 65 శాతం నిధులను టీటీడీ కేటాయిస్తుందని చెప్పారు. ఈ ఉద్యోగుల హౌసింగ్ ప్రాజెక్టుకు రూ.230 కోట్ల మేర మౌలిక వసతుల అభివృద్ధి ప్రణాళికకు టీటీడీ బోర్డు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు.. తిరుమల–తిరుపతిని వాణిజ్యపరంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. తిరుపతిని భవిష్యత్తులో వెడ్డింగ్ డెస్టినేషన్‌గా అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉందన్నారు. రిలయన్స్‌కు చెందిన వంతారా సంస్థ తిరుపతిలో గోశాల ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు. గోశాలతో పాటు జియోలాజికల్ పార్క్‌ను కూడా ఏర్పాటు చేయాలని సూచించినట్లు చెప్పారు.

100 మెగావాట్ల సోలార్ విద్యుత్
తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు మరింత ప్రాధాన్యం ఇస్తూ 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యంతో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు. వ్యర్థాల నిర్వహణ, స్వచ్ఛమైన రవాణా, పచ్చదనం, పునరుత్పాదక విద్యుత్ వంటి చర్యల ద్వారా తిరుమలను మరింత పర్యావరణహిత ప్రాంతంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని వివరించారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..