
తప్పని పరిస్థితుల్లోనే దేశంలో లాక్డౌన్ విధించాల్సి వచ్చిందని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఆంక్షల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని అందుకు తనని క్షమించాలని వేడుకున్నారు. ముఖ్యంగా దినసరి కూలీలు పడుతున్న బాధల్ని తాను అర్థం చేసుకోగలనని వ్యాఖ్యానించారు. ప్రజలు తమని తాము రక్షించుకుంటూ తమ కుటుంబాల్ని కూడా కాపాడుకోవడానికే లాక్డౌన్ విధించామన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సృష్టిస్తున్న విలయతాండవం నేపథ్యంలోనే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఈరోజు జరిగిన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మరికొన్ని రోజుల పాటు ‘లక్ష్మణ రేఖ’ దాటకుండా ఉండాల్సిందేనని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో ప్రతిఒక్కరూ ధైర్యంతో కరోనాపై పోరాడాలని పిలుపునిచ్చారు. వైరస్ కట్టడికి వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది చేస్తున్న కృషిని అభినందించిన ప్రధాని వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రజలను కోరారు.





