
గౌహతి : ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే గౌహతిలోని ప్రాగ్జ్యోతిష్ పూర్ విశ్వ విద్యాలయంలో సమాజ నిర్మాణంలో విద్య, సంస్కృతి, విలువల పాత్రపై ప్రసంగించారు. ఈ సందర్భంగా హోసబళే తన విలువైన ఆలోచనలను, దృక్పథాలను పంచుకున్నారు. విద్య, సాంస్కృతిక స్పృహ మరియు దేశ నిర్మాణం పట్ల మరింత బలమైన, అర్థవంతమైన దృక్పథాన్ని పెంపొందించుకునే దిశగా ఆయన ప్రసంగం విద్యార్థులు, అధ్యాపకులు మరియు విశ్వవిద్యాలయ సమాజ సభ్యులకు స్ఫూర్తినిచ్చింది.
హోసబళే తన ప్రసంగంలో సామాజిక, జాతీయ అభివృద్ధిలో విద్య పోషించే పరివర్తనాత్మక పాత్రను సభలో వివరించారు. విద్యార్థి కేంద్రీకృతంగా జరిగే అభ్యాసం, నైపుణ్య ఆధారిత అభ్యసనంపై కూడా మాట్లాడారు.
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా వ్యక్తిత్వ వికాసం, విలువలతో కూడిన విద్య ప్రాముఖ్యాన్ని మరింతగా నొక్కి చెప్పారు. విద్యార్థులే దేశ భవిష్యత్తుకు పునాది అని తెలిపారు. లాభాపేక్ష లేకుండా ప్రాగ్జ్యోతిష్ పూర్ విశ్వ విద్యాలయం నడుస్తోందని, సామాజిక సేవ కూడా చేస్తోందని అభినందించారు.
ఈ కార్యక్రమం పూర్తైన తర్వాత దత్తాత్రేయ హోసబళే, ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు భాగయ్య, విశ్వ విద్యాలయం అధికారులు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. పర్యావరణంతోనే సుస్థిరమైన భవిష్యత్తును నిర్మించాలని వీరంతా పిలుపునిచ్చారు.





