
బీదర్: కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ‘వందేమాతరం’, ‘భారత్ మాతా కీ జై’ నినాదాల వ్యవహారం వివాదానికి దారితీసింది. చిత్గుప్పలోని షాహీన్ పీయూ కళాశాలలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం దేశభక్తి నినాదాలు చేసిన విద్యార్థిని ప్రిన్సిపాల్ అబ్దుల్ హకీమ్ హెచ్చరించారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రిన్సిపాల్పై కేసు నమోదైంది.
ఫిర్యాదు ప్రకారం.. జెండా ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం విద్యార్థి సాగర్ గౌలి ‘వందేమాతరం’, ‘భారత్ మాతా కీ జై’ నినాదాలు చేశాడు. దీంతో ప్రిన్సిపాల్ అతడిని మందలించి, మరోసారి ఇలాంటి నినాదాలు చేయవద్దని హెచ్చరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థిని కొంతసేపు ఓ గదిలో ఉంచి మానసికంగా ఒత్తిడికి గురిచేశారని తల్లిదండ్రులు ఆరోపించారు.
‘వందేమాతరం’ నినాదాలు ఒక నిర్దిష్ట మత వర్గానికి సంబంధించినవని, కళాశాలలో ఇలాంటి నినాదాలను సహించబోమని ప్రిన్సిపాల్ చెప్పినట్లు విద్యార్థి తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కళాశాలలో హిందూ, ముస్లిం విద్యార్థులు కలిసి చదువుకుంటున్నప్పటికీ.. ప్రిన్సిపాల్ మతపరమైన వివక్ష చూపుతున్నారని ఆయన ఆరోపించారు.
పోలీసులకు ఫిర్యాదు.. కేసు నమోదు
బాధిత విద్యార్థి తండ్రి హిరోబా గౌలి ఫిర్యాదు మేరకు చిత్గుప్ప పోలీసులు ప్రిన్సిపాల్ అబ్దుల్ హకీమ్పై కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఆరోపణలపై పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
హిందూ సంఘాల ఆగ్రహం
ఈ ఘటన వెలుగులోకి రావడంతో పలు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దేశభక్తి నినాదాలను అడ్డుకోవడం సరికాదని పేర్కొంటూ.. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. విద్యార్థుల మధ్య మతపరమైన విభేదాలకు తావులేకుండా విద్యాసంస్థల్లో సమానత్వం, సామరస్యాన్ని కాపాడాలని కోరాయి.




