News

లష్కరే ఉగ్రవాదిని మట్టుబెట్టిన భద్రతా దళాలు!

18views

జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలు జరిపిన యాంటీ టెర్రర్ ఆపరేషన్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాది హతమయ్యాడు. మరణించిన ఉగ్రవాదిని కుల్గాం నివాసి జాకీర్ గనిగా గుర్తించారు. ఇతడు 2024లో లష్కరే తోయిబాలో చేరినట్లు, భద్రతా దళాల మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఖచ్చితమైన నిఘా సమాచారంతో జూలై 3న షోపియాన్‌లోని సైదాపోరా, మీమందర్ పరిసరాల్లోని దట్టమైన తోటల ప్రాంతంలో ఆర్మీకి చెందిన రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్‌పీఎఫ్, షోపియాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఐదో రోజుకు చేరిన ఈ సుదీర్ఘ ఆపరేషన్‌లో బుధవారం (జూలై 8) ఎదురుకాల్పులు జరిగాయి. దట్టమైన చెట్లను అడ్డుపెట్టుకుని తప్పించుకోవడానికి ఉగ్రవాదులు లతీఫ్, జాకీర్ ప్రయత్నించగా, ఆర్మీ కౌంటర్-ఇన్సర్జెన్సీ విభాగానికి చెందిన విక్టర్ ఫోర్స్ చుట్టుముట్టింది.

ఉగ్రవాదులు జరిపిన కాల్పులకు భద్రతా దళాలు దీటుగా సమాధానమిచ్చాయి. అనంతరం జాకీర్ గని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలం నుండి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సీజ్ చేశారు. మిగిలిన ఉగ్రవాదుల కోసం గాలింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.