
అయోధ్య రామాలయ విరాళాల కేసు ఆధారంగా సనాతన ధర్మంపై దాడి చేస్తున్న విపక్షాలు… వక్ఫ్ విషయంలో మాత్రం నోరు తెరవటం లేదని ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. వక్ఫ్కు సంబంధించిన విషయాలపై ప్రతిపక్షాల నోళ్లకు తాళాలు ఎందుకు పడతాయని ప్రశ్నించారు. ‘‘సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్లు ఊసరవెల్లికన్నా వేగంగా రంగులు మారుస్తున్నాయి. రామాలయ నిర్మాణాన్ని వ్యతిరేకించిన పార్టీలు ఇప్పుడు అయోధ్యలో మత విశ్వాసాలకు విఘాతం కలిగిందని అంటున్నాయి. వక్ఫ్ ఆస్తుల అన్యాక్రాంతాన్ని గురించి మౌనం వహించే ప్రతిపక్షాలు రామాలయంలో విరాళాల స్వాహాపై మాట్లాడటం ద్వారా సనాతన ధర్మంపై దాడి చేస్తున్నాయి’’ అని ఆయన అన్నారు. రామాలయ విరాళాల వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాల్సిందిగా శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం ట్రస్టు తనను కోరిందని, ఆ బృందం నిజాన్ని నిర్ధరిస్తుందని తాను హామీ ఇచ్చానని ఆయన అన్నారు.





