
రామమందిర విరాళాల దుర్వినియోగంపై శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. ఇందులో దోషులుగా తేలిన వారికి అత్యంత కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో ఈ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
‘‘శ్రీరామలల్లా ఆలయంలో భక్తుల విరాళాలు చోరీకి గురయ్యాయన్న విషయం తీవ్ర వేదన కలిగిస్తోంది. ఈ పాపానికి పాల్పడిన ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలి. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ న్యాయం చేస్తారనే పూర్తి నమ్మకం నాకు ఉంది’’ అని నృత్య గోపాల్ దాస్ పేర్కొన్నారు. కోట్లాది మంది హిందువుల విశ్వాసానికి సంబంధించిన అంశం కావడంతో దీనిపై ఎలాంటి రాజకీయాలు చేయరాదని గోపాల్ దాస్ సూచించారు.
విరాళాల లెక్కింపులో అక్రమాల ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు కొనసాగుతోంది. ట్రస్ట్ నిబంధనల ప్రకారం చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామాలను ఆమోదించాలంటే ట్రస్ట్ సభ్యుల్లో మూడింట రెండొంతుల మద్దతు అవసరం. సమావేశానికి ఎంతమంది సభ్యులు హాజరవుతారన్నదానిపై తుది నిర్ణయం ఆధారపడనుంది.





