సమాజంలో ప్రతి ఒక్కరూ సూర్యోపాసన చేయడం ద్వారా మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతుందని శృంగవృక్షంకి చెందిన శ్రీ దత్త పీఠాధిపతి పూజ్యశ్రీ సాయి దత్త నాగానంద సరస్వతి స్వామీజీ పిలుపునిచ్చారు. శనివారం ఐ. పోలవరం మండలం గుత్తెనదీవి గ్రామంలో ఆయన విస్తృతంగా పర్యటించారు.
ఉభయగోదావరి జిల్లాలలో ‘అరుణం‘ అనే పేరుతో ప్రజల ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక పర్యటనలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా జి. వేమవరం, గుత్తెనదీవి గ్రామాలలో సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన పలు కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్వకాలంలో మన పెద్దలు నిత్యం సూర్యోపాసన చేసేవారని తెలిపారు. సూర్యోపాసన చేయడం ద్వారా మానవులు వివిధ వైరల్ వ్యాధులు సోకకుండా చేసుకోవచ్చని తెలిపారు. కరోనా వంటి మహమ్మారులు ప్రబలుతున్న ప్రస్తుత తరుణంలో సూర్యోపాసన మానవజాతికి రక్షణ కవచంలా ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ రెల్లు గంగాధర్, ముమ్మిడివరం సేవా భారతి ప్రతినిధి శ్రీ పేరాబత్తుల రామకృష్ణ, గుత్తెనదీవి సాయిరామ్ విద్యానికేతన్ అధినేత శ్రీ సలాది శ్రీనివాస రావు, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ బొక్క లక్ష్మీనారాయణ, సమీప గ్రామాల భక్తులు పాల్గొన్నారు.