ఆధునిక ప్లాస్టిక్ సర్జరీకి ఆద్యుడు, శస్త్రచికిత్స పితామహుడు మహర్షి సుశ్రుతుడి 90 కిలోల కాంస్య విగ్రహాన్ని యూకేలో ఆవిష్కరించారు. 1505లో స్థాపించిన ప్రపంచంలోనే మొట్టమొదటి, అతిపెద్ద శస్త్రచికిత్స సంస్థగా (140కి పైగా దేశాల్లో 33,000 మందికి పైగా సభ్యులతో) పేరుగాంచిన ‘రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్బర్గ్’లో మహర్షి సుశ్రుతుడి కాంస్య విగ్రహాన్ని ‘ప్లేఫెయిర్ ఆడిటోరియం’లో ఆవిష్కరించారు. తెలుగు మూలాలున్న యూకే శస్త్రచికిత్స నిపుణుడు ప్రొఫెసర్ చంద్ర చెరువు (FRCS) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన కృషి ఫలితంగా నేడు ప్రపంచం మొత్తం మహర్షి సుశ్రుతుడిని ‘శస్త్రచికిత్స పితామహుడు’గా ఏకగ్రీవంగా అంగీకరిస్తోంది. ఈ విగ్రహాన్ని ప్రొఫెసర్ చంద్ర చెరువు, ఆయన కుటుంబం స్థాపించిన ‘చెరువు ఫ్యామిలీ ఫౌండేషన్’ విరాళంగా ఇచ్చింది. దీనిని తమిళనాడులోని తిరువణ్ణామలైకి చెందిన ఓ శిల్పి రూపొందించారు.
ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ చెరువు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు, సిద్ధార్థ్ మల్లిక్ (ఎడిన్బర్గ్ భారత కాన్సుల్ జనరల్), ప్రొఫెసర్ రోవాన్ పార్క్స్ (మాజీ ప్రెసిడెంట్), ప్రొఫెసర్ క్లేర్ మెక్నాట్ (రాయల్ కాలేజ్ ఆఫ్ ఎడిన్బర్గ్ ప్రెసిడెంట్), ప్రొఫెసర్ మార్క్ హాల్పెర్న్ (కాలిఫోర్నియా కాలేజ్ ఆఫ్ ఆయుర్వేద వ్యవస్థాపకుడు)లతోపాటు అమెరికా, భారత్, యూకే నుంచి అనేకమంది ప్రముఖులు హాజరయ్యారు. ప్రపంచానికి నిజమైన చరిత్రను తెలియజేయడం, సుశ్రుతుడిని తొలి శస్త్రచికిత్స నిపుణుడిగా గౌరవించడం ఈ చర్య ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
అటు సుశ్రుత విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా ప్రొఫెసర్ చెరువు “మహర్షి శుశ్రుత: ఎ కంపెండియం – ఫాదర్ ఆఫ్ సర్జరీ” అనే పేరుతో 280 పేజీల సమగ్రమైన, ఆధారాలతో కూడిన పుస్తకాన్ని తయారు చేసి విడుదల చేశారు. విగ్రహాన్ని, ఈ పుస్తకాన్ని స్వీకరించడం ద్వారా మహర్షి సుశ్రుతుడు నిజమైన ‘శస్త్రచికిత్స పితామహుడు’ అని ‘రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్బర్గ్’ ప్రపంచానికి చాటిచెప్పింది.
ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేదం, ఆధునిక వైద్య రంగాలకు చెందిన 36 మంది నిపుణులు మహర్షి సుశ్రుత పద్ధతులు, ఆచరణలు 21వ శతాబ్దానికి ఎంతగానో ఉపయోగపడతాయనే అంశంపై ఈ పుస్తకంలో సమగ్ర చర్చలు చేశారు. ఆధునిక వైద్యం హిప్పోక్రేటిస్ ప్రమాణాన్ని అనుసరిస్తున్నప్పటికీ ఆ కాలానికి కొన్ని శతాబ్దాల ముందే సుశ్రుతుడు ఆ ప్రమాణాన్ని కనిపెట్టారని ఈ పుస్తకం ఆధారాలతో సహా తెలిపింది. ఆయన శస్త్రచికిత్స, ప్లాస్టిక్ సర్జరీ, వైద్యం, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, టాక్సికాలజీ, యూరాలజీ వంటి అనేక వైద్య విభాగాలను క్రమబద్ధీకరించారు. ఈ పుస్తకం ఆన్లైన్లో ఈ-బుక్ రూపంలో కూడా (అమెజాన్, గూగుల్ బుక్స్, కిండిల్ వంటి వేదికలపై) అందుబాటులోకి వచ్చింది.
ప్రపంచంలోనే అత్యంత పురాతన శస్త్రచికిత్స కళాశాలలో తొలి శస్త్రచికిత్స నిపుణుడు సుశ్రుతుడు. భారతదేశానికి చెందిన మహర్షి సుశ్రుతుడు ఒక దార్శనిక శస్త్రచికిత్స నిపుణుడు. సుమారు 2,600 సంవత్సరాల క్రితమే ఆయన 300కి పైగా శస్త్రచికిత్సలు చేశారు. 124 రకాల శస్త్రచికిత్స పరికరాలను ఆవిష్కరించారు. ఈ విజ్ఞానాన్ని భావి తరాలకు అందించే ఉద్దేశంతో ప్రపంచంలోనే మొట్టమొదటి శస్త్రచికిత్స గ్రంథమైన ‘సుశ్రుత సంహిత’ను రచించారు.
2,600 ఏళ్ల క్రితం, ప్రపంచంలో చాలా భాగం శస్త్రచికిత్స శాస్త్రాన్ని అర్థం చేసుకోవడం కూడా ప్రారంభించలేదు. అలాంటి కాలంలోనే భారత దేశం అప్పటికే సుశ్రుత సంహిత ద్వారా వందలాది శస్త్రచికిత్సా విధానాలు, పునర్నిర్మాణ పద్ధతులు, పరికరాలు, వైద్య నీతిని నమోదు చేసింది. ఆధునిక ప్లాస్టిక్ సర్జరీకి చాలా కాలం ముందు సుశ్రుతుడు నుదుటి చర్మపు పొరలను ఉపయోగించి నాసికా పునర్నిర్మాణం చేపట్టారు. ఆధునిక ప్రపంచంలో వైద్య నీతి నియమబద్ధం కావడానికి చాలా కాలం ముందే ఆయన శస్త్రచికిత్స శిక్షణ, వైద్య క్రమశిక్షణ, నీతికి సంబంధించిన సూత్రాలను నిర్దేశించారు.
దివంగత డాక్టర్ సి.ఎస్. శాస్త్రి (MS) కుమారుడే ప్రొఫెసర్ చంద్ర చెరువు. వీరి కుటుంబం ఏపీలోని తెనాలి సమీపంలోని పెరవలి గ్రామానికి చెందినది. ఈ గ్రామంలో చెరువు కుటుంబం ఆరు శతాబ్దాలకు పైగా ప్రజలకు ఉచిత మూలికా వైద్య సేవలను అందిస్తోంది. డాక్టర్ సి.ఎస్. శాస్త్రి స్వయంగా విజయవాడలో ప్రసిద్ధ శస్త్రచికిత్స నిపుణుడిగా 1974 నుంచి వైద్య సేవలందించారు. ప్రొఫెసర్ చెరువు ఆంధ్ర మెడికల్ కాలేజీలో MBBS, మణిపాల్లో MS పూర్తి చేశారు. అనంతరం 1991లో యూకేకి వెళ్లిన ఆయన, ఇంగ్లాండ్, ఎడిన్బర్గ్, గ్లాస్గో, ఇంటర్కాలేజియేట్ బోర్డ్ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ నుంచి నాలుగు FRCS అర్హతలను సాధించారు.
ఈ విగ్రహావిష్కరణతో పాటు, తన తండ్రి జ్ఞాపకార్థం ప్రొఫెసర్ చెరువు ‘చెరువు ఫ్యామిలీ లెగసీ గ్రాంట్’ ద్వారా రెండు శాశ్వత వార్షిక ‘ట్రావెలింగ్ సర్జికల్ స్కాలర్షిప్ల’ను ఆయన ఏర్పాటు చేశారు. రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్బర్గ్ ద్వారా అందించే ఈ స్కాలర్షిప్లు శస్త్రచికిత్స నిపుణులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ వైద్య కేంద్రాలను సందర్శించి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి సాయపడతాయి.