ArticlesNews

శ్రేష్ఠం… జ్యేష్ఠం

6views

సంవత్సరం పొడుగునా మనకు ఎన్నో పర్వదినాలుంటాయి. జ్యేష్ఠ మాసంలోనూ అలాగే పలు విశేష సందర్భాలున్నాయి. ఈ ఏడాది అధిక మాసం తరవాత నిజ జ్యేష్ఠం ప్రారంభమవుతోంది. జ్యేష్ఠ నక్షత్రానికి అధిదేవత ఇంద్రుడు. ఈ నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు పౌర్ణమి ఏర్పడే మాసం కాబట్టి ఇది జ్యేష్ఠమైంది.

జ్యేష్ఠ శుక్లపాడ్యమి నాడు మహిళలు సౌభాగ్యం కోసం కరవీరవ్రతం చేస్తారు. అంటే గన్నేరుపూలతో అమ్మవారిని పూజిస్తారు. కొందరు భద్ర చతుష్టయ వ్రతం కూడా చేసుకుంటారు. విదియనాడు శ్రాద్ధకర్మలు ఆచరించి, పితృదేవతలకు తర్పణాలు విడుస్తారు. ఈ రోజుకు ‘సోప పదము’ అన్న పేరూ ఉంది. ‘రంభాతృతీయ’గా పేర్కొనే తదియ రోజున రంభావ్రతం చేస్తారు. ‘రంభ’ అంటే ‘అరటి’. పార్వతీదేవి స్వర్ణప్రతిమను అరటి చెట్టుకింద ఉంచి, పూజించి, వస్త్రదానం చేయడం ఆనవాయితీ. శుద్ధచవితి పార్వతీదేవి ఉమాదేవిగా అవతరించిన పర్వదినమని బ్రహ్మపురాణం చెబుతోంది. ఈ రోజున ‘శుక్లాదేవి’నీ పూజిస్తారు. శుద్ధపంచమి కూడా పితృదేవతలకు ప్రీతికరమైన రోజు. శుద్ధషష్ఠి నాడు అరణ్యక గౌరీవ్రతం, వింధ్యవాసినీవ్రతం చేస్తారు. దీనికే ‘స్కందషష్ఠి’ అన్న పేరు కూడా ఉంది. సప్తమినాడు ద్వాదశీ సప్తమి వ్రతం, వరుణ పూజ చేస్తారన్నది చతుర్వర్గ చింతామణి కథనం. శుద్ధఅష్టమిని దుర్గాష్టమి, త్రిలోచనాష్టమి అని పిలుస్తారు. ఈ రోజున శుక్లాదేవి రూపంలో అవతరించిన అమ్మవారిని ఆరాధిస్తారు. నవమినాడు ఉపవాసం ఉండి, బ్రహ్మణీ దేవిని పూజిస్తారు. దశమికి ‘దశపాపహర దశమి’ అన్న పేరూ ఉంది. పది పాపాలను పోగొట్టే గొప్ప పర్వదినమని దీనికి పేరు. ఇది గంగావతరణ పుణ్యదినమని స్మృతికౌస్తుభం చెబుతోంది.

శుద్ధఏకాదశికి ‘నిర్జల ఏకాదశి’ అన్న పేరూ ఉంది. ఈ రోజున నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉంటారు. ఏమాత్రం ఆకలికి తట్టుకోలేని భీముడు పట్టుదలతో ఈ ఒక్కరోజున ఉపవాసం చేసి ఇరవై నాలుగు ఏకాదశుల ఉపవాస పుణ్యఫలితం పొందాడంటారు. చంపక ద్వాదశిగా ప్రసిద్ధి పొందిన జ్యేష్ఠ శుక్ల ద్వాదశినాడు త్రివిక్రమ మూర్తిని అర్చిస్తారు. ఆదిశంకరుల కైలాస యాత్ర ఈ రోజుననే జరిగిందంటారు. జ్యేష్ఠ పౌర్ణమి రోజున వటసావిత్రీ వ్రతం ఆచరిస్తారు. వటవృక్షం శ్రీమహావిష్ణు స్వరూపం. యముడితో పోరాడి భర్త సత్యవంతుణ్ని సజీవంగా వెంట తీసుకొచ్చిన సావిత్రి ఈ రోజున పూజలందుకుంటుంది. ఈ పుణ్యదినాన్ని ‘ఏరువాక పున్నమి’గా రైతుల పండుగగా జరుపుకొంటారు. కృష్ణయజుర్వేదంలో ఈ పర్వదినం గురించి సవివరంగా ఉంది.

బహుళఅష్టమి రోజున త్రిలోచన పూజ, తిందుకాష్టమీవ్రతం, శీతలాష్టమి వ్రతం ఆచరిస్తారు. బహుళ ఏకాదశిని అపర ఏకాదశిగా, యోగిని ఏకాదశిగా పేర్కొంటారు. శ్రీమహావిష్ణువు కూర్మావతారం ధరించిన బహుళ ద్వాదశి ‘కూర్మ జయంతి’గా ప్రసిద్ధి చెందింది. పౌర్ణమినాడు వటసావిత్రీ వ్రతం చేయలేనివారు అమావాస్య నాడైనా చేయవచ్చని వ్రతవిధానం చెబుతోంది. ఇన్ని పర్వదినాలు ఉండటం వల్లనే జ్యేష్ఠం అత్యంతŸ శ్రేష్ఠం అన్న మాట జన వ్యవహారంలో స్థిరపడింది.