
జమ్మూకాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలపై దౌత్యపరంగా శాంతి యుతంగా పరిష్కరించుకోవాలంటూ యూరోపియన్ యూనియన్ విదేశీ వ్యవహారాలు, భద్రతా విధానాల ఉన్నత ప్రతినిధి కాజా కల్లాస్ చేసిన వ్యాఖ్యలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. పాక్-ఈయూ సంయుక్త ప్రకటనలో చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘‘భారత్ అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన అంశాలపై ఇటువంటి అనవసర వ్యాఖ్యలను మేము పూర్తిగా తిరస్కరిస్తున్నాం. జమ్మూకాశ్మీర్, లడఖ్ భారత్లో అంతర్భాగాలు. ఈ విషయాల్లో ఎలాంటి హక్కు లేని వారు వ్యాఖ్యానించకుండా ఉండాలి.’’ అని హితవు పలికారు. జమ్మూకశ్మీర్పై చేసిన వ్యాఖ్యలు ఏ మాత్రం అంగీకారయోగ్యం కావని… భారత్కు చెందిన అంతర్గత అంశం మాట్లాడొద్దని హితవు పలికారు. ప్రస్తుతం పాకిస్థాన్లో కాజా కల్లాస్ పర్యటిస్తున్నారు.
బంగ్లాదేశ్తో నదీ జలాల అంశాలపై..
ఇక భారత్-బంగ్లాదేశ్ మధ్య నదీ జలాల అంశాలపై కూడా స్పందించారు. భారత్, బంగ్లాదేశ్ మధ్య 54 నదులు ఉమ్మడిగా ఉన్నాయని తెలిపారు. ఈ నదులకు సంబంధించిన అంశాలను పరిష్కరించేందుకు ఉమ్మడి నదుల కమిషన్ అనే ద్వైపాక్షిక వ్యవస్థ పనిచేస్తోందని చెప్పారు. నదీ జలాల వినియోగం, నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలను ఈ ద్వైపాక్షిక వ్యవస్థ ద్వారానే చర్చించి పరిష్కరిస్తామని, భవిష్యత్తులో కూడా ఇదే విధానం కొనసాగుతుందని పేర్కొన్నారు.





