News

హైవేపై సీసీటీవీ.. పాకిస్థాన్‌కు సైనిక రహస్యాల చేరవేత!

34views

డబ్బు కోసం భారత దేశ రహస్యాలను పాకిస్థాన్‌కు అమ్ముకుంటున్న ఓ వ్యక్తిని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. పఠాన్‌కోట్‌ ప్రాంతంలో భారత సైన్యం, పారామిలిటరీ కదలికలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్‌లోని తన హ్యాండ్లర్లతో పంచుకున్న ఒక అనుమానిత గూఢచర్య నెట్‌వర్క్ బండారాన్ని పోలీసులు బయటపెట్టారు.

చక్ ధరివాల్ గ్రామానికి చెందిన బల్జిత్ సింగ్ అలియాస్ బిట్టు అనే వ్యక్తి ఈ దేశద్రోహానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అతడు భారత సైన్యం, పారామిలిటరీ దళాల కదలికలపై నిఘా పెట్టేందుకు, జాతీయ రహదారి-44లోని ఒక వంతెన సమీపంలోని దుకాణంలో సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ సీసీటీవీలోని సమాచారాన్ని పాకిస్థాన్‌కు పంపినట్లు సీనియర్ పోలీస్ అధికారి దల్జిందర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తానే సీసీటీవీ కెమెరాలు అమర్చినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.

దుబాయ్‌లోని ఓ అపరిచితుడు ఇచ్చిన ఆదేశాల మేరకు నిందితుడు పని చేస్తున్నాడని, అందుకు ప్రతిఫలంగా రూ.40 వేలు తీసుకునే వాడని పోలీసులు దర్యాప్తులో తేలింది. నిందితుడి వద్ద నుంచి ఒక సీసీటీవీ కెమెరాతో పాటు ఇంటర్నెట్ వైఫై రౌటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

పఠాన్‌కోట్-జమ్మూ జాతీయ రహదారి మార్గంలో అనుమానాస్పద కార్యకలాపాల గురించి సమాచారం అందడంతో పోలీసులు ఈ చర్యకు దిగారు. ఈ కేసులోనే బిట్టుతో పాటు విక్రమ్‌జిత్ సింగ్, బల్విందర్ సింగ్, తరణ్‌ప్రీత్ సింగ్ అనే మరో ముగ్గురిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు నేరపూరిత, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఉన్నతాధికారులకు పంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పంజాబ్ పోలీసులు వెల్లడించారు.