
కేరళ రాష్ట్రం త్రిసూర్ లోని శ్రీ భద్రకాళీ విష్ణుమాయా ఆలయానికి భారీ రోబోటిక్ ఏనుగు బహుమతిగా అందింది. అనితా డోంగ్రే ఫౌండేషన్ , పెటా ఇండియా సంయుక్తంగా ‘పున్నక్కపరంబిల్ మహాదేవన్ ’ అనే ఈ భారీ రోబోటిక్ ఏనుగును బహుమతిగా ఇచ్చారు. మలయాళ నూతన సంవత్సరమైన విషు వేడుకల సందర్భంగా భక్తుల సమక్షంలో ఆలయ నిర్వాహకులు ఈ ఏనుగును ఆవిష్కరించారు.
పురాతన కాలం నుంచి ప్రముఖ ఆలయాల్లో ఉత్సవాలను ఏనుగుల అంబారీలతో నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే ఇందుకు నిజమైన ఏనుగులను వినియోగిస్తుండటంవల్ల కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు జరిగాయి. ఏనుగులు అకస్మాత్తుగా బెదిరి బీభత్సం చేసిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని ఉత్సవాల్లో మరణాలు కూడా సంభవించాయి. ఇలాంటి ఘటనలు జరగకుండా సురక్షితంగా ఉత్సవాలను నిర్వహించుకోవడం కోసం ఆలయాలకు ఈ రోబోటిక్ ఏనుగులను బహుమతిగా ఇస్తున్నట్లు పెటా ఇండియా తెలిపింది.
కేరళ రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆలయాలకు పెటా ఇండియా రోబోటిక్ ఏనుగులను బహుమతులుగా ఇస్తూ వస్తున్నది. వాటిలో ఈ ‘పున్నక్కపరంబిల్ మహాదేవన్’ అనే ఏనుగు 14వది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా వివిధ ఆలయాలకు 25 రోబోటిక్ ఏనుగులను బహుమతిగా ఇచ్చినట్లు పెటా ఇండియా తెలియజేసింది.





