
అరుణాచల్ ప్రదేశ్లోని ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు పెడుతుండటాన్ని భారత్ ఖండించింది. అక్కడి ప్రాంతాలకు పేర్లు పెట్టడం వల్ల అరుణాచల్ చైనాది అయిపోదని, అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని స్పష్టం చేసింది. చైనా వ్యవహరిస్తున్న తీరుపై మీడియా అడిగిన ప్రశ్నకు భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతిని రణ్ధీర్ జైస్వాల్ స్పందిస్తూ, భారత భూభాగంలోని ప్రాంతాలకు పేర్లు పెడుతూ చైనా ఎలాంటి తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేసినా దానిని భారత్ నిర్ద్వంద్వంగా ఖండిస్తుందని చెప్పారు.
వాస్తవాలను మార్చలేరు
భారత భూభాగాలను తమవిగా చైనా నమ్మించే ప్రయత్నాలు ఎంతమాత్రం సరికావని, ఇటువంటి తప్పుడు ప్రయత్నాలు వాస్తవాలను మార్చలేవని జైస్వాల్ అన్నారు. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమని, అంతర్భాగంగానే ఉంటుందని స్పష్టం చేశారు. ఇలాంటి నిరాధార ప్రయత్నాల వల్ల ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల స్థిరీకరణ, యధాపూర్వ పరిస్థితికి తీసుకువచ్చే ప్రయత్నాలు నీరుగారుతాయని చెప్పారు. చైనా గతంలోనూ అరుణాచల్ ప్రదేశ్ను దక్షిణ టిబెట్ అని పిలుస్తూ పేర్లు మార్పునకు ప్రయత్నాలు చేయడం, దానిని భారత్ నిర్ద్వంద్వంగా ఖండించడం జరిగింది.





