News

కుమారుడికి “భారత్” అని పేరు పెట్టిన పాకిస్థాన్ సీమా హైదర్

83views

సీమా హైదర్.. ఒకప్పుడు భారత్‌లో ఈ పేరు మార్మో్గింది. పాకిస్థాన్‌కు చెందిన ఈ మహిళ పబ్జీ ఆన్‌లైన్ గేమ్ ద్వారా పరిచయమైన ఉత్తరప్రదేశ్‌కు చెందిన సచిన్ మీనా అనే యువకుడిని ప్రేమించింది. తన నలుగురు పిల్లలతో కలిసి 2023లో నేపాల్ మీదుగా అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించింది. అప్పట్లో ఈ అంశం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం గ్రేటర్ నోయిడాలో నివసిస్తున్న ఈ పాకిస్థానీ వలసదారురాలు సీమా హైదర్ మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా తన కుమారుడికి భారత్ అని నామకరణం చేసింది. గ్రేటర్ నోయిడాలోని రబుపురా ప్రాంతంలో జరిగిననామకరణ వేడుకకు పెద్ద ఎత్తున కుటుంబీకులు, గ్రామస్థులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ నామకరణోత్సవ వేడుకలో మీడియాతో మాట్లాడింది సీమా హైదర్. “హిందూమతం నాకు చాలా నచ్చింది. హిందూ మతాన్ని స్వీకరించిన నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను హిందువుగా మారినందుకు గర్వపడుతున్నాను. అయితే.. నా ఆరో కుమారుడి పేరు “భా”తో మొదలైతే మంచిదని పురోహితులు చెప్పారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో చర్చించి ‘భారత్’ అనే పేరును ఖరారు చేశాం. ‘భారత్’ కంటే అందమైన పేరు మరొకటి లేది. ఈ పేరు దేశ గుర్తింపునకు ప్రతీక. ఈ పేరు పెట్టడం నాకు గర్వకారణం. భారత్ క్రికెట్ మ్యాచ్‌లు చూడటం నాకు చాలా ఇష్టం. భారత్ గెలిస్తే నేను ఎంతో సంతోషిస్తాను. భారత్ ఆడినప్పుడల్లా విజయం కోసం దేవుడిని ప్రార్థిస్తాను.” అని సీమ చెప్పారు. తాను భారత్‌లోనే ఉండాలనుకుంటున్నానని, పాకిస్థాన్‌కు తిరిగి వెళ్లాలనుకోవడం లేదని సీమా హైదర్ మరోసారి స్పష్టం చేశారు. తనకు అపారమైన ప్రేమ, ఆదరణ లభించాయని పేర్కొన్నారు. ఇక్కడ నివసించడం ఆమెకు ఆనందంగా ఉందని తెలిపింది.