ArticlesNews

పుంగనూరు ‘గో’ మక్కువ

103views

సాధారణంగా పశువుల పెంపకం అంటే శ్రమతో కూడుకున్న పని. గతంలో ప్రతి రైతు ఇంట్లో దేశీయ పశువులు ఉండేవి. కానీ ట్రాక్టర్ల రాకతో వాటి సంఖ్య తగ్గి, కేవలం పాల కోసం పెంచే జర్సీ ఆవులే ఊరూరా కనిపిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో అన్నమయ్య జిల్లా  పులిచెర్లకు చెందిన రైతు గోటూరి మురళీమోహన్‌రెడ్డి విభిన్నంగా ఆలోచించారు. అంతరించిపోతున్న పుంగనూరు జాతి ఆవులపై మక్కువతో వాటి పెంపకాన్ని చేపట్టి నేడు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

నమ్మకంతో మొదలై.. లాభసాటిగా మారి

ఆరు సంవత్సరాల క్రితం, ఉదయాన్నే పుంగనూరు ఆవును చూస్తే శుభం జరుగుతుందన్న నమ్మకంతో మురళీమోహన్‌రెడ్డి రూ. 75 వేలు వెచ్చించి ఒక ఆవును కొనుగోలు చేశారు. మొదట ఇంటి ఆవరణలోనే పెంచినప్పటికీ, క్రమంగా వీటి సంఖ్య పెరగడంతో ప్రస్తుతం ఐదు ఆవులకు చేరింది. ఇందులో ఒక మగ ఆవు (నంది) కూడా ఉంది,. సంఖ్య పెరగడంతో తన మామిడి తోపులో ప్రత్యేక షెడ్‌ ఏర్పాటు చేసి మనుషుల ద్వారా వీటిని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఇపుడు మరో ఆవు కూడా జతచేరనుంది.

ఆదాయం ఇలా..

పాల ధర : ఈ ఆవు రోజుకు ఉదయం 2, సాయంత్రం 2 లీటర్ల పాలు ఇస్తుంది. లీటరు ధర మార్కెట్‌లో రూ.100 నుంచి రూ.200 వరకు పలుకుతోంది.

దూడల విక్రయం : ఒక్కో దూడ ధర మార్కెట్‌లో రూ. 75 వేల నుంచి రూ. 1.50 లక్షల వరకు పలుకుతోంది.

వ్యర్థాలకు డిమాండ్‌ : కేవలం పాలే కాకుండా, వీటి పేడ మరియు మూత్రానికి ప్రకృతి వ్యవసాయం చేసే వారి నుంచి విపరీతమైన డిమాండ్‌ ఉంది.

నేటి కాలంలో పాడి పరిశ్రమ అంటే కేవలం పాల దిగుబడి మాత్రమే కాదు, మన దేశీయ పశు సంపదను కాపాడుకోవడం కూడా అని మురళీమోహన్‌రెడ్డి నిరూపిస్తున్నారు. తక్కువ పెట్టుబడి, తక్కువ రోగాలతో, అత్యధిక పోషక విలువలున్న పాలను అందించే పుంగనూరు ఆవుల పెంపకం రైతులకు నిజంగానే బంగారు బాతు లాంటిది. అంతరించిపోతున్న ఈ జాతిని కాపాడుకుంటూ, ఆర్థికంగా ఎదగవచ్చని ఆయన చాటిచెబుతున్నారు.