News

భారత్‌ వైభవానికి ఆర్‌ఎస్‌ఎస్‌ కృషి

96views

రాష్ట్రీయ స్వయం సేవక్‌ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వైభవ భారతం కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలోని కే–స్క్వేర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా ఆర్‌ఎస్‌ఎస్‌ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్‌ (ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల) భరత్‌ కుమార్‌ వ్యవహరించారు. ముఖ్య అతిథిగా ఆర్‌ఎస్‌ఎస్‌ జిల్లా సంఘ చాలక్‌ రామసుబ్బారెడ్డి విచ్చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్‌ ఆవిర్భవించి 100 ఏళ్లు పూర్తి చేసుకుని 2025 విజయదశమి నాడు శతాబ్ది వేడుకలను ఘనంగా ప్రారంభించిందని, ఈరోజు ఆర్‌ఎస్‌ఎస్‌ 100 ఏళ్ల వైభవ భారతం దృష్టి, దిశ అనే ఇతివృత్తం చుట్టూ కార్యక్రమం జరుగుతోందన్నారు. 100 ఏళ్లలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఎదుర్కొన్న అనేక సవాళ్లు, సమాజానికి ఆర్‌ఎస్‌ఎస్‌ ఎందుకు అవసరం అనే విషయాలు వివరించారు. భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెట్టాలని, భారత్‌ను వైభవ స్థితికి ఎలా తీసుకుపోవాలో, జాతీయ భావాలు ఎలా పెంపొందించుకోవాలో, దేశభక్తి ఎలా పెంపొందించుకోవాలి అనే విషయాలు తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంఘాలు 45 వరకు పని చేస్తున్నాయని, విద్యాసంస్థలో విద్యా భారతి, విద్యార్థి రంగంలో విద్యార్థి పరిషత్‌, ఉపాధ్యాయ రంగంలో ఉపాధ్యాయ సంఘం, ధార్మిక రంగంలో విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌దళ్‌ కార్మిక రంగంలో భారతీయ మజ్దూర్‌ సంఘ్‌, ఇలా అనేక రంగాలలో ఉన్నాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో చింతకొమ్మదిన్నె, కడప నగరం, పెండ్లిమర్రి మండలం చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వివిధ రంగాల ప్రతిభావంతులు డాక్టర్స్‌, ఇంజినీర్స్‌, బిజినెస్‌ మ్యాన్స్‌, విద్యావేత్తలు, సైంటిస్టులు, పాఠశాలల కరస్పాండెంట్లు, వృత్తి నిపుణులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్‌ సాధించిన విజయాలు, భవిష్యత్తు దిశా నిర్దేశంపై ప్రతిభావంతులతో చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విభాగ ప్రచారక్‌ లక్ష్మణ్‌, జిల్లా ప్రచారక్‌ మహేష్‌, చింతకొమ్మదిన్నె, ఒంటిమిట్ట, చెన్నూరు, పెండ్లిమర్రి, కడప నగరం నుంచి వివిధ రంగాల ప్రతిభావంతులు సుమారు 400 మంది పైగా పాల్గొన్నారు.