News

వాష్‌రూమ్‌ సూచికలుగా ఛత్రపతి శివాజీ మహారాజ్, మహారాణి పద్మిని చిత్రాలు

153views

ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు చెప్పగానే యువతలో ఊపు వస్తుంది. శివాజీ చరిత్ర చెబితే గూస్‌బంప్స్ పక్కా. సమ సమాజ స్థాపన, హిందూ రాజ్యం ఏర్పాటు కోసం శివాజీ చేసిన కృషి అంతా ఇంతా కాదు.. అలాంటి మహానీయుడి చిత్రపటానికి తాజాగా ఘోర అవమానం ఎదురైంది. పురుషులు, స్త్రీల బాత్‌రూమ్‌లు గుర్తు పట్టేలా సింబల్స్ ఉంచుతారన్న విషయం తెలిసిందే. ఇక్కడ పురుషుల బాత్‌రూమ్ బయట ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రాన్ని ఉంచారు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఒక ప్రైవేట్ బ్యాంక్వెట్ హాల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వాష్‌రూమ్‌ల బయట పురుష–మహిళల సూచికలుగా ఛత్రపతి శివాజీ మహారాజ్, మహారాణి పద్మిని చిత్రాలను ఉపయోగించారు. ఈ వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా జనాలు ఆగ్రహానికి గురయ్యారు. వీడియోలో మాట్లాడుతున్న వ్యక్తి ఇది సిక్రీ గ్రామంలోని “మిలాన్ బ్యాంక్వెట్ హాల్”లో తీసినదని చెప్పడంతో ఈ అంశం మరింత హాట్ టాపిక్‌గా మారింది.

ఈ క్లిప్ బయటకు వచ్చిన వెంటనే అనేక మంది నెటిజన్లు దీనిని గొప్ప యోధుడైన శివాజీ మహారాజ్‌కు అవమానంగా పేర్కొంటూ హాల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరికొందరు ఈ బ్యాంక్వెట్ హాల్ హర్యానాలోని ఓ మాజీ మంత్రికి సంబంధించినదని సైతం ఆరోపణలు ఉన్నాయి. దీంతో రాజకీయ రంగు సైతం పులుముకుంది. అయితే ఈ ఆరోపణలను బ్యాంక్వెట్ హాల్ యజమాని టిపర్‌చంద్ ఖండించారు. వైరల్ వీడియోలో కనిపిస్తున్న ప్రదేశం తనదికాదని స్పష్టం చేశారు. తనను అపకీర్తి పరచడానికి కావాలనే తప్పుదారి పట్టించే ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల ప్రాంతంలో అక్రమంగా ఉన్న కొన్ని బ్యాంక్వెట్ హాళ్లను కూల్చివేయడంతో అసంతృప్తి చెందిన కొందరు తన పేరును ఈ వివాదంలోకి లాగుతున్నారని అన్నారు. ఈ ఘటనపై రాజకీయ స్పందనలు సైతం వచ్చాయి. ఎంపీ వర్షా గైక్వాడ్ సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేస్తూ శివాజీ మహారాజ్ వారసత్వాన్ని పదేపదే అవమానిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ఈ దృశ్యాలు పూర్తిగా అంగీకరించలేనివని పేర్కొంటూ వెంటనే వాటిని తొలగించాలని హర్యానా ప్రభుత్వాన్ని కోరారు.