News

కశ్మీరీ పండిట్లపై దాడుల బెదిరింపు పోస్టర్లు

123views

జమ్ముకశ్మీర్‌లోని మైనారిటీలైన కశ్మీరీ పండిట్లను బెదిరిస్తూ పోస్టర్లు వెలిశాయి. వారిపై దాడులు చేస్తామని ఉగ్రవాద సంస్థ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తమకు భద్రత కల్పించాలని కశ్మీరీ పండిట్లు డిమాండ్‌ చేస్తున్నారు. కశ్మీర్‌ లోయలో ఉగ్రవాద పోస్టర్లు కనిపించాయి. కశ్మీర్‌ పండిట్ల లక్ష్యంగా ఉగ్రవాద దాడులకు పాల్పడతామని అందులో హెచ్చరించారు. పాకిస్థాన్‌ మద్దతు ఉన్న ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్‌)కు చెందిన ఫాల్కన్ గ్రూప్ పేరుతో ఈ పోస్టర్లు వెలిశాయి.

కాగా, జమ్ముకశ్మీర్‌లోని కశ్మీర్‌ పండిట్లు ఈ పోస్టర్లపై ఆందోళన వ్యక్తం చేశారు. తమ భద్రత కోసం తగిన చర్యలు తీసుకోవాలని కశ్మీరీ పండిట్ సంఘర్ష్ సమితి (కేసీఎస్‌ఎస్‌) డిమాండ్‌ చేసింది. కశ్మీర్ లోయలోని మైనారిటీ సమాజాన్ని ప్రభావితం చేసే పరిస్థితిని పర్యవేక్షించాలని అంతర్జాతీయ హక్కుల సంఘాలను కోరింది.

మరోవైపు ఈ బెదిరింపు పోస్టర్లపై దర్యాప్తు చేస్తున్నట్లు జమ్ముకశ్మీర్‌ పోలీస్‌ అధికారి తెలిపారు. మైనారిటీలను రక్షించడానికి బలమైన భద్రతా యంత్రాంగం ఉన్నదని చెప్పారు. మైనారిటీ ప్రాంతాల ప్రజలకు రక్షణ, భద్రత కోసం జమ్ముకశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్‌ను మోహరించినట్లు వెల్లడించారు.