
ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమల శ్రీవారి కొండపైన మాధవ కల్యాణ మండపంలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ (హెచ్డీపీటీ) ఆధ్వర్యంలో అర్చకులు, ట్రస్ట్ జిల్లా కో–ఆర్డినేటర్లతో విస్తృత సమావేశాన్ని నిర్వహించారు. ట్రస్ట్ ఛైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీవారి దేవస్థానం ఏఈఓ పి.నటరాజారావు, రాష్ట్ర కో–ఆర్డినేటర్ కోట సునీల్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో అర్చకులు తమ జీవనోపాధి, గౌరవ వేతనాల పెంపు, పెండింగ్ బకాయిలు విడుదల, చిన్న దేవాలయాల అభివృద్ధి, దేవాలయ ఆస్తుల రక్షణ, హుండీ లెక్కల పారదర్శకత, గోశాలల పరిరక్షణ, అర్చకుల వైద్య–పింఛన్ భద్రత తదితర అంశాలపై విస్తృతంగా విన్నపాలు చేశారు. వీటిపై శ్రీనివాసులు స్పందిస్తూ అర్చకుల అభ్యర్థనలను పూర్తిగా అర్థం చేసుకున్నానని తెలిపారు. వీటిని సమగ్రంగా సంకలనం చేసి ప్రభుత్వం, దేవాదాయ శాఖ అధికారులతో చర్చించి ప్రతిపాదనల రూపంలో ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.





