
558views
మానవరహిత విమానాల (యూఏవీ) తయారీ కోసం ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (ఐఏఐ)తో కలిసి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్), డైనమెటిక్ టెక్నాలజీస్ లిమిటెడ్ (డీటీఎల్) ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ భాగస్వామ్యంలో భారత భద్రతా బలగాలకు అవసరమైన యూఏవీలను తయారుచేయనున్నారు. లఖ్నవూలో బుధవారం ప్రారంభమైన డిఫెన్స్ ఎక్స్పో-2020 సందర్భంగా ఈ ఒప్పందం ఖరారైంది. తాజా ఒప్పందంతో సైనిక ఉత్పత్తుల తయారీలో హెచ్ఏఎల్ సామర్థ్యం పెరిగే అవకాశం ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.మాధవన్ తెలిపారు. అలాగే ఇజ్రాయెల్ నుంచి అత్యాధునిక సాంకేతికత సమకూర్చుకునే అవకాశం ఉంటుందన్నారు. ‘భారత్లో తయారీ’లో భాగంగానే ఈ ఒప్పందం కుదిరిందన్నారు. భవిష్యత్లో భారీ ఎత్తున యూఏవీలను భారత్ సైన్యంలో చేర్చేందుకు హెచ్ఏఎల్ యోచిస్తోందన్నారు.





