News

శ్రీశైలం మల్లన్న స్పర్శ దర్శనాల స్లాట్స్ పెంపు..

203views

శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి భక్తులకు దేవస్థానం శుభవార్త అందించింది. భక్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని మల్లన్న స్పర్శ దర్శనాల స్లాట్లను పెంచుతున్నట్లు శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వాహక అధికారి-ఈవో శ్రీనివాసరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త విధానం 2026 జనవరి నెల నుంచి అమల్లోకి రానుంది. ప్రతి వారం శని, ఆదివారాలు మరియు సోమవారాల్లో మల్లన్న స్పర్శ దర్శనాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ రోజుల్లో ప్రతి రెండు గంటలకు ఒకసారి స్పర్శ దర్శన స్లాట్ అందుబాటులో ఉంటుంది.

భక్తుల సౌకర్యార్థం స్పర్శ దర్శనం టికెట్లను పూర్తిగా ఆన్‌లైన్‌లోనే అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. మొత్తం 5 స్పర్శ దర్శన స్లాట్లకు ఆన్‌లైన్‌ ద్వారానే టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పించామని, ఆఫ్‌లైన్‌లో టికెట్లు జారీ చేయబోమని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో అధిక సంఖ్యలో భక్తులు మల్లన్న స్వామిని స్పర్శ దర్శనం చేసుకునే అవకాశం లభించనుంది. ముఖ్యంగా వారాంతాలు, సోమవారాల్లో దర్శనానికి వచ్చే భక్తులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుందని దేవస్థానం అధికారులు తెలిపారు. మల్లన్న భక్తుల్లో ఈ ప్రకటనపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దర్శనానికి వచ్చే భక్తులు ముందుగానే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకుని రావాలని అధికారులు సూచిస్తున్నారు.