News

సంస్కృతంపై ఉద‌య‌నిధి వ్యాఖ్య‌ల‌కు బీజేపీ కౌంట‌ర్

176views

సంస్కృతం మ‌ర‌ణించిన భాష అని ఉద‌య‌నిధి స్టాలిన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయ‌న వ్యాఖ్య‌ల ప‌ట్ల బీజేపీ రియాక్ట్ అయ్యింది. ఒక భాష‌ను త‌క్కువ‌గా చూసి మ‌రో భాష‌ను మెచ్చుకోవ‌డం సరికాదు అని త‌మిళ‌సై సౌంద‌ర్య‌రాజ‌న్ అన్నారు.

గ‌తంలో ఓసారి స‌నాత‌న ధ‌ర్మం గురించి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన త‌మిళ‌నాడు డిప్యూటీ సీఎం ఉద‌య‌నిది స్టాలిన్ ఇప్పుడు సంస్కృత భాష గురించి అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. సంస్కృత భాష‌ను మ‌ర‌ణించిన భాష‌గా విమ‌ర్శించారు. ఉద‌య‌నిధి వ్యాఖ్య‌ల ప‌ట్ల బీజేపీ రియాక్ట్ అయ్యింది. ఓ బుక్ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న డీఎంకే నేత .. కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రిని ఖండించారు. త‌మిళ భాష అభివృద్ధి కోసం కేవ‌లం 150 కోట్లు కేటాయించార‌ని, కానీ సంస్కృత భాష గురించి 2400 కోట్లు కేటాయించిన‌ట్లు తెలిపారు.

ఉద‌య‌నిధి చేసిన వ్యాఖ్య‌ల‌ను బీజేపీ నేత త‌మిళ‌సై సౌంద‌ర్య‌రాజ‌న్ త‌ప్పుప‌ట్టారు. ఏ భాష‌ను కూడా మృత‌భాష‌గా పిలిచే హ‌క్కు ఎవ‌రికీ లేద‌న్నారు. ఇప్ప‌టికీ దేశ‌వ్యాప్తంగా సంస్కృత భాష‌ను.. ప్రార్థ‌న‌లు, ఉత్స‌వాల్లో వినియోగిస్తున్న‌ట్లు చెప్పారు. ఒక భాష‌ను త‌క్కువ‌గా చూసి మ‌రో భాష‌ను మెచ్చుకునే మ‌న‌సుత‌త్వం ప్రాథ‌మికంగా స‌రైంది కాదు అన్నారు. త‌మిళ భాష‌లోనూ అనేక సంస్కృత ప‌దాలు ఉన్నాయ‌న్నారు. త‌మిళం ఓ ఓపెన్ హార్ట్ లాంగ్వేజ్ అని, అనేక ప‌దాలు, ఐడియాల‌ను ఆ భాష ఆక‌ర్షించింద‌ని, సంస్కృతం నుంచి కూడా ఎన్నో సేక‌రించామ‌ని, ఇది ఆ భాష శ‌క్తిని చాటుతుంద‌ని, బ‌ల‌హీన‌త‌ను కాదు ఆమె అన్నారు.