
కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితి(ఐరాస)లో లేవనెత్తేందుకు పాకిస్థాన్ మరోసారి విఫలయత్నం చేసింది. పాక్ కుయుక్తులపై భారత్ తీవ్ర స్థాయిలో మండిపడింది. కుట్రలను పక్కనబెట్టి.. ఇరు దేశాల మధ్య సంబంధాల మెరుగుదలకు చేపట్టాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలని హితవు పలికింది. కశ్మీర్ విషయంలో తొలి నుంచి పాక్కు చైనా మద్దతుగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా దాయాది దేశానికి డ్రాగన్ తప్ప మరే ఇతర సభ్య దేశాలు అండగా నిలవకపోవడం గమనార్హం.
ఓ ఆఫ్రికన్ దేశానికి చెందిన అంశంపై ఐరాస భద్రతా మండలి(యూఎన్ఎస్సీ) బుధవారం రహస్య సమావేశానికి పిలుపునిచ్చింది. దీంట్లో చర్చించాల్సిన ఇతర అంశాల జాబితాలో కశ్మీర్ విషయాన్ని చేర్చాలని చైనా కోరింది. కానీ, ఇతర సభ్యదేశాలు అంగీకరించకపోవడంతో చైనాకు భంగపాటు తప్పలేదు. పైగా కశ్మీర్ భారత్-పాక్ ద్వైపాక్షిక అంశమని స్పష్టం చేసింది.
కశ్మీర్పై ఐరాసలో పాక్ కుయుక్తులు ఏమాత్రం చెల్లుబాటు కాలేదని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ అన్నారు. పాక్ చేస్తున్న నిరాధార ఆరోపణలు విశ్వసనీయమైనవి కాదని నేడు తేలిపోయిందన్నారు. సభను తప్పుదోవ పట్టించాలన్న పాక్ బుద్ధిని సభ్యదేశాలు తిరస్కరించాయని తెలిపారు. ఈ అనుభవంతో పాక్ ఇప్పటికైనా ఇరు దేశాల మధ్య సంబంధాల మెరుగుదలపై దృష్టి సారిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆగస్టులోనూ ఇదే తరహా పయత్నం చేసిన చైనా.. రహస్య సమావేశం ఏర్పాటు చేసినప్పటకీ సభ్యదేశాల మద్దతు మాత్రం కూడగట్టలేకపోయింది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





