News

పీఓకేలో నిరసనలు.. పాక్ సైన్యం దురాగతాలపై స్పందించిన భారత్..

191views

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లో నిరసనలు కొనసాగుతున్నాయి. స్వాతంత్ర్యం కోరుతూ నిరసనకారులపై పాకిస్థాన్ సైన్యం విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఫలితంగా డజన్ల కొద్దీ జనాలు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. PoK లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ముజఫరాబాద్‌కు లాంగ్ మార్చ్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. నిరసన కారులు ముజఫరాబాద్‌కు చేరుకోకుండా నిరోధించడానికి పాకిస్థాన్ ప్రభుత్వం నిశ్చయించుకుంది. అయితే.. తాజాగా ఈ అంశంపై భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ నిరసనలు అణచివేత, దోపిడీ ఫలితమని స్పష్టం చేశారు.

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో హింస, నిరసనలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడారు. “పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని అనేక ప్రాంతాలలో నిరసనలు జరిగినట్లు మేము చూశాం. పాకిస్థాన్ సైన్యం అమాయక పౌరులపై క్రూరత్వం ప్రదర్శించింది. ఇది పాకిస్థాన్ అణచివేత విధానం. చట్టవిరుద్ధంగా ఆక్రమించిన ప్రాంతాల నుంచి వనరులను క్రమబద్ధంగా దోచుకోవడం వల్లే ఈ నిరసన జరిగిందని మేము విశ్వసిస్తున్నాం. పాకిస్థాన్ ఈ భయంకరమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు జవాబుదారీగా ఉండాలి.” అని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. PoKలోని ప్రజలు చాలా రోజులుగా షాబాజ్ ప్రభుత్వానికి, అసిమ్ మునీర్ సైన్యానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. అవామీ యాక్షన్ కమిటీ (AAC) నేతృత్వంలో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ముజఫరాబాద్, మీర్పూర్, కోట్లి, రావలకోట్, నీలం లోయతో సహా అనేక జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ఈ నిరసనల కారణంగా, పీఓకేలోని అనేక ప్రాంతాల్లో దుకాణాలు మూసేశారు. రవాణాకు తీవ్ర అంతరాయం కలిగింది. అక్కడి జన జీవనం పూర్తిగా స్తంభించింది.