
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు ఊహించని షాక్ తగిలింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అరుదైన ఖనిజాలను ప్రదానం చేసినందుకు స్వదేశంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. మునీర్కు స్వదేశంలో రాజకీయ నాయకుల నుంచి కౌంటర్లు వస్తున్నాయి. మునీర్ బ్రాండెడ్ సేల్స్ పర్సన్గా వ్యవహరించారని పాకిస్తాన్ సెనేటర్ ఐమల్ వలీ ఖాన్ సెటైరికల్ కామెంట్స్ చేశారు.
పాకిస్తాన్ పార్లమెంట్లో తాజాగా సెనేటర్ ఐమల్ వలీ ఖాన్ మాట్లాడారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మన దేశానికి చెందిన అరుదైన ఖనిజాలను బ్రీఫ్ కేసులో పెట్టుకుని తిరుగుతున్నారు. పాకిస్తాన్ మట్టి ఖనిజాలను ట్రంప్కు చూపించారు. మునీర్ ఒక సేల్ పర్సన్ మాదిరిగా వ్యవహరిస్తున్నారు. ఇక, పాక్ ప్రధాని మేనేజర్లా జరుగుతున్న డ్రామాను చూస్తూ ఉండిపోయారు. ఇంత కంటే పెద్ద జోక్ ఏమైనా ఉంటుందా?. మునీర్ ఏ హోదాలో.. ఏ చట్టం కింద ఇలా చేశారు. ఇది నియంతృత్వం కాదా?. ఇది ప్రజాస్వామ్యం కాదని చెప్పడానికి నేను చింతిస్తున్నాను. ఇది పార్లమెంటును ధిక్కరించడం కాదా? అని ప్రశ్నిస్తూ ఘాటు విమర్శలు చేశారు. దీంతో, పాక్ ఆర్మీ చీఫ్ మునీర్కు ఎదురుదెబ్బ తగిలింది.
ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను బుట్టలో వేసుకోవడానికి పాక్ నాయకులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. గత వారం పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్ వైట్ హౌస్లో ట్రంప్ను కలిశారు. ఈ సందర్భంగా ట్రంప్నకు ఓ చెక్కపెట్టెను బహూకరించారు. దానిలో పాక్లో వెలికి తీసిన అరుదైన ఖనిజాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని వైట్ హౌస్ విడుదల చేసింది. పాక్ ఆర్మీ చీఫ్ ఆ పెట్టెలోని రంగురాళ్లను చూపుతూ ఏదో చెబుతుండగా.. ట్రంప్ వాటిని ఆసక్తిగా చూస్తున్నట్లు అందులో ఉంది. అనంతరం మునీర్ మాట్లాడుతూ..‘పాకిస్తాన్ వద్ద రేర్ ఎర్త్ మినరల్స్ ఖజానా ఉంది. దీంతో దేశ రుణభారం చాలా వరకు తగ్గిపోనుంది. అతి త్వరలోనే పాక్ సుసంపన్న సమాజాల్లో ఒకటిగా మారుతుంది’ అని వ్యాఖ్యలు చేశారు.





