
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నేడు (విజయ దశమి) వందవ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఆర్ఎస్ఎస్ 1925లో ప్రారంభమయ్యింది. ఈ చారిత్రాత్మక మైలురాయిని గుర్తుచేస్తూ పద్మశ్రీ అవార్డు గ్రహీత, అంతర్జాతీయంగా పలువురు ప్రశంసలు పొందిన సైకత శిల్ప కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ పూరీ బీచ్లో ‘100 ఏళ్ల నిస్వార్థ సేవ’ అనే సందేశంతో అద్భుతమైన సైకత శిల్పాన్ని రూపొందించారు.
ఎనిమిది టన్నుల ఇసుకతో రూపొందించిన ఈ ఆరు అడుగుల పొడవైన కళాకృతిలో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్, మాధవ్ సదాశివరావు గోల్వాల్కర్ (గురూజీ)లకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సుదర్శన్ పట్నాయక్ మాట్లాడుతూ ‘వందేళ్ల ఆర్ఎస్ఎస్ అందించిన క్రమశిక్షణ, నిస్వార్థ సేవా ప్రయాణం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు. 65కి పైగా అంతర్జాతీయ శాండ్ ఆర్ట్ ఈవెంట్లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన పట్నాయక్.. వాతావరణ మార్పు, ప్రజారోగ్యం తదితర సామాజిక సమస్యలపై అవగాహన పెంచేందుకు సైకత కళను ప్రదర్శిస్తుంటారు.





