
( సెప్టెంబర్ 15 – పొణకా కనకమ్మ వర్ధంతి )
స్వతంత్ర భారతావని కోసం అసువులుబాసినవారిలో ఎందరో మహానుభావులు ఉన్నారు. పురుషులతో పాటు మహిళలు కూడా సమానంగా పోరాట పటిమను ప్రదర్శించారు. గతించిన కాలం వలే వారందరినీ మరచిపోతున్నాం. కాని ఆ త్యాగధనుల త్యాగంతో నేడు మనదేశం సూర్యుని వలే వెలుగొందుతుంది. వారి పోరాటం నేటి తరానికి ఆదర్శం. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా నుంచి తొలి మహిళా స్వాతంత్ర పోరాట యోధురాలిగా చరిత్ర పుటల్లో నిలిచిన పోనక కనకమ్మ గురించి ఎంతమందికి తెలుసు అంటే నేటి తరానికి తెలియదు. కాని ఆమె జ్ఞాపకంగా నిలిచిన కస్తూరిదేవి విద్యాలయం వద్దకు వెళితే ఆమె పోరాట జీవితం కళ్లముందు కదలాడుతుంది. ఆ రోజుల్లోనే ఆడపిల్లల చదువుకోసం, వారి ఆర్థిక స్వాతంత్య్రం కోసం ఆమె కృషి చేశారు. ఎంతోమంది ఆడపిల్లలు ఈ విద్యాలయంలో చదువుకుని ఉన్నతులుగా ఎదిగారు.
నెల్లూరులోని మినగల్లు గ్రామంలో మరుపూరు కొండారెడ్డి, కమ్మమ్మ దంపతులకు కనకమ్మ 1892 జూన్ 10న జన్మించారు. పుట్టింది పెద్ద భూస్వామ్య కుటుంబంలోనే. కాని చిన్నతనం నుంచి ఆ గ్రామంలోని హరిజనుల కోసం ఆమె పాటుపడ్డారు. మహాత్మాగాంధీ అనుచరురాలిగా పేరొందిన కనకమ్మ 1913లో ‘సుజన రంజని సమాజం’ ఏర్పాటుచేసి హరిజనోద్ధరణకు కృషిచేశారు. 1921 ఏప్రిల్ 7వ తేదీన గాంధీజీ పల్లెపాడు గ్రామంలో ‘పినకాని సత్యాగ్రహ ఆశ్రమం’ ఏర్పాటుచేయగా దానికి 13 ఎకరాల భూమిని ఇచ్చారు. అంతేకాదు గాంధీజీ పిలుపునందుకుని సహాయ నిరాకరణ ఉద్యమంలోనూ, ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలోనూ పాల్గొన్నారు. రాయవెల్లూరు జైలులో బ్రిటిషువారు ఆమెకు జైలుశిక్ష విధించినా వెరవక అనుభవించారు.
నెల్లూరులో కనకమ్మ చేస్తున్న స్వాతంత్య్ర ఉద్యమం గురించి తెలుసుకున్న బిపిన్ చంద్రపాల్ 1907లో నెల్లూరు సందర్శించి ఆశీర్వదించారు. ఆరోజుల్లోనే బాలికా విద్య ప్రాధాన్యతను గుర్తించిన కనకమ్మ నెల్లూరులో కస్తూరిదేవి విద్యాలయాన్ని స్థాపించారు. ఈ పాఠశాల భవనానికి 1929లో గాంధీజీ పునాదిరాయి వేశారు. ఈ విద్యాలయం 23 ఎకరాల భూమిని ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో కొన్నాళ్లు పనిచేసిన కనకమ్మ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ఉపాధ్యక్షురాలిగా కూడా పనిచేశారు.
కనకమ్మ రమణ మహర్షి భక్తురాలు. కనకమ్మ ఏకైక కుమార్తె వెంకటసుబ్బమ్మ కూడా రచయిత్రి, సామాజిక కార్యకర్త. బిడ్డి మరణానంతరం కూడా కుంగిపోకుండా కనకమ్మ తన సేవాకార్యక్రమాలను కొనసాగించారు. జమీన్ రైతు అనే తెలుగు వార పత్రికను స్థాపించి జమీన్ రైతు ఉద్యమానికి తోడ్పాటునందించారు. ఈ ఉద్యమంలోనే ఆమె తన ఆస్థినంతంటిని పోగొట్టుకున్నారు. అయినప్పటికీ తల్లి బాటలో నడిచిన వెంకట సుబ్బమ్మ మహిళల కోసం ఇండ్రస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్ను నెలకొల్పి మహిళలకు ఉపాధి శిక్షణ ఇచ్చి వారి కాళ్ల మీద వారు నిలబడేటట్లు కృషిచేశారు. స్త్రీలు సంకల్పిస్తే ఎంత పనైనా చేయగలరు. ఒక పత్రికా నిర్వహణే కాదు, రాజ్యాంగాన్నే శాసించగలరనే అభిప్రాయాన్ని వ్యక్త పరిచిన పొణకా కనకమ్మ 1963 సెప్టెంబరు 15వ తేదీన మరణించారు. కనకమ్మ కోసం ఎంతో మంది స్వాతంత్య్ర సమరయోధులు, రచయితలు వచ్చేవారు. వారితో ఆ ఇంట దేశభక్తి ఉప్పొంగేది. పేరు కోసం కాకుండా దేశభక్తితో తన సేవా కార్యక్రమాలను చనిపోయేవరకు కొనసాగించిన కనకమ్మను మరో దేశభక్తురాలు దుర్గాబాయి దేశ్ముఖ్ చేతుల మీదుగా స్వర్ణకంకణ సన్మానాన్ని అందుకున్నారు.





