
విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో కఠిన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దర్శనానికి వచ్చేవారికి సాంప్రదాయ దుస్తులు లేకుంటే ఆలయంలోకి అనుమతించరు.. అమ్మవారి ఆలయంలో సెల్ఫోన్ వాడకంపై కూడా పూర్తిగా నిషేధం విధించారు. ఆలయ సాంప్రదాయాలకు భంగం కలగకుండా ఈ ఆంక్షలు అమలు చేస్తున్నట్టు చెబుతున్నారు అధికారులు. ప్రోటోకాల్ దర్శనాలకు వచ్చే వారు తమ సెల్ఫోన్లను ఆఫీసులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. భక్తులు, ఉద్యోగులందరికీ సాంప్రదాయ దుస్తులు తప్పనిసరి అని ఆదేశాలు జారీ చేశారు. స్కానింగ్ పాయింట్, టికెట్ కౌంటర్ వద్ద కఠిన తనిఖీలు నిర్వహించనున్నారు.
ఇటీవల ఆలయ పాలకమండలి సమావేశాల్లో ఈ అంశంపై చర్చ జరిగింది. ప్రత్యేకించి శరన్నవరాత్రుల కాలంలో లక్షలాది భక్తులు తరలివస్తారు.. ఆ సమయంలో భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాల్సిన అవసరముందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే తిరుమల శ్రీవారి ఆలయంలో సంప్రదాయ వస్త్ర విధానం విజయవంతంగా అమలవుతోంది. ఇదే నమూనాను కనకదుర్గమ్మ ఆలయంలోనూ అమలు చేస్తే ఆలయ మర్యాదలు మరింత పెరుగుతాయి అని అ సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.. ఈ మేరకు దేవాదాయ శాఖ, ప్రభుత్వ అధికారి స్థాయిలో చర్చలు జరిపారు.. గత కొద్ది రోజులు నుంచి భక్తులకు పూర్తి స్థాయిలో అవగాహన కలిపిస్తూ దుర్గగుడిలో సంప్రాయాదాయ దుస్తుల సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేశారు.. భక్తులు ఆలయ దర్శనానికి వచ్చే సమయంలో పురుషులు ధోతి, అంగవస్త్రం ధరించాలి. మహిళలు చీర, హాఫ్ సారీ లేదా సంప్రదాయ రీతిలో ఉండే వస్త్రాలు ధరించాల్సి ఉంటుంది.





