News

తెరుచుకున్న కశ్మీర్​లోని పర్యాటక ప్రదేశాలు​- టూరిస్ట్​లతో కళకళలాడుతున్న పహల్గాం!

254views

జమ్మూకశ్మీర్​లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన 2 నెలల తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా మూసివున్న పర్యాటక ప్రాంతాలు దశలవారీగా తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో పహల్గాంతో సహా చుట్టు పక్కల ప్రాంతాలకు పర్యాటకుల తాకిడి పెరిగింది. సెల్ఫీలు దిగుతూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. పర్యాటకుల రద్దీతో పలు చోట్ల వాహనాల రద్దీ ఏర్పడింది. పర్యాటకుల తాకిడితో జమ్మూ-కశ్మీర్‌ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పహల్గాం లోయలోని పలుచోట్ల భద్రతా దళాలను మోహరించారు.

ఉగ్రదాడితో ఆగిన పర్యాటకం
పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్మూకశ్మీర్‌లోని పర్యాటక ప్రాంతాలపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలోనే భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని పర్యాటక ప్రాంతాలను అధికారులు మూసివేశారు. అయితే మూసివున్న తోటలు, పార్కులు, పర్యాటక ప్రాంతాలన్నీ తిరిగి తెరచుకోనున్నట్లు జమ్మూ-కశ్మీర్‌ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ఇటీవల ప్రకటించారు. ముఖ్యంగా పహల్గామ్ మార్కెట్, వెరినాగ్ గార్డెన్, కోకర్నాగ్ గార్డెన్, అచాబల్ గార్డెన్, బేతాబ్ వ్యాలీ పార్కులు ఈనెల 17 నుంచి తెరుచుకుంటాయని వెల్లడించారు. ఈ నిర్ణయంతో పహల్గాంలో పర్యాటకుల తాకిడి పెరిగింది. దాదాపు 2నెలల తర్వాత పహల్గాం సహా చుట్టుపక్కల ప్రాంతాలు పర్యాటకులతో కళకళలాడుతున్నాయి. సెల్ఫీలు దిగుతూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. కుటుంబాలతో కలిసి నది ఒడ్డున సేదతీరుతున్నారు. పర్యాటకుల రద్దీతో పహల్గాంలోని పలుచోట్ల ట్రాఫిక్‌ ఏర్పడింది.

స్థానికులకు ఉపాధి
ఏటా జమ్మూ-కశ్మీర్‌లో ఎలాంటి వాతావరణ పరిస్థితులన్నా పర్యాటకులతో రద్దీగానే ఉండేది. అక్కడి స్థానికులు దాదాపు టూరిజం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. కానీ, పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి తర్వాత పరిస్థితులు మారిపోయాయి. గతంలో మాదిరిగా ప్రస్తుతం పర్యాటకుల రావడంలేదని స్థానికులు చెబుతున్నారు. ఈనెల 17 నుంచి మూసీవున్న ప్రాంతాలకు తిరిగి పర్యాటకులను అనుమతిస్తే కొంత మేర పరిస్థితి మెరుగవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2 నెలల తర్వాత పహల్గాంలో పర్యాటకుల తాకిడి పెరగడంతో జమ్మూ-కశ్మీర్‌ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పహల్గాం లోయలోని పలుచోట్ల భద్రతా దళాలను మోహరించారు. అనుమానిత ప్రాంతాలు, నది తీర ప్రాంతాల్లో నిరంతరం పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. జులై 3 నుంచి అమర్‌నాథ్‌ యాత్రకు సైతం భారీగా భక్తుల వచ్చే అవకాశాలు ఉన్నందున భద్రతాపరమైన చర్యలు, తనిఖీలు చేపడుతున్నారు.

కళకళలాడుతున్న పర్యాటక ప్రదేశాలు
ఇప్పటికే బేతాబ్​ లోయ, పెరనాగ్​, కోకెర్నాగ్​, అచాబల్​ మొఘల్​ గార్డెన్స్​ సహా పహల్గామ్​ పట్టణంలోని చాలా పార్కులు పర్యాటకులతో కళకళలాడుతున్నాయి. ఇవి కాకుండా త్వరలో బాదంవారి పార్క్​, డక్ పార్క్​, శ్రీనగర్​లోని తఖ్​దీర్ పార్క్​, సర్థాల్​, కతువాలోని ధగ్గర్​, దేవి పిండి, సియాద్​ బాబా, రియాసిలోని సులా పార్క్​, దోడాలోని గుల్దండా, జై వ్యాలీ, ఉదంపూర్​లోని పంచేరి మొదలైనవి పర్యాటక ప్రదేశాలు త్వరలో దశలవారీగా పునఃప్రారంభం జరగనున్నాయి.