
సింధూ నాగరికతను అత్యంత ప్రాచీనమైన ఈజిప్ట్, మెసపటోమియా నాగరికతలతో పోల్చుతారు! క్రీస్తుపూర్వం 2,500 ఏళ్ల క్రితం భారత్లోని వాయవ్య ప్రాంతంలో సింధూనదీ తీరంలో ఈ నాగరికత విలసిల్లిందని చెబుతారు! మరి.. సింధూ నాగరికతకు ముందే మరో నాగరికత ఉండిందా? సముద్ర నీటిమట్టం పెరగడంతో ఆ నగరం మునిగిపోయిందా? నర్మద, తపతి, సబర్మతి నదులు.. గుజరాత్ వద్ద అరేబియా సముద్రంలో కలిసే ప్రాంతం ‘ఖంబాట్ గల్ఫ్’ ఉంది కదా! అక్కడ హరప్పా నాగరికతకు ముందుగానే నాగరికత విలసిల్లిందని 25 ఏళ్ల క్రితం భారత సముద్ర నిపుణుల పరిశోధనలు చెబుతున్నాయి. ఈ పరిశోఽధనలను ఎవ్వరూ ఆమోదించలేదు.. అలా అని తిరస్కరించనూ లేదు! అయితే 2000 సంవత్సరంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్ఐవోటీ) ఖంబాట్ గల్ఫ్ వద్ద నాగరికత అనవాళ్లను కనుగొంది. అక్కడ సముద్రంలో 120 అడుగుల లోతులో ఐదు మైళ్ల పొడవు, రెండు మైళ్ల వెడల్పుతో విస్తరించి ఉన్న నగరం ఆనవాళ్లు లభ్యమయ్యాయి. కుండలు, పూసలు, శిల్పాలు, మానవ అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిపై పరిశోధనలు చేసిన నిపుణులు, ఇవన్నీ దాదాపు 9,500 ఏళ్ల నాటివని, హరప్పా నాగరికతకు ముందునుంచే ఉన్నాయని చెప్పారు. సముద్ర మట్టాలు పెరగడం వల్ల ఈ నాగరికత తాలూకు నగరం మునిగిపోయిందని ఎన్ఐవోటీ బృందంలోని భూ విజ్ఞాన శాస్త్రవేత్త బద్రీనార్యన్ పేర్కొన్నారు. అయితే ఖంబాట్ గల్ఫ్ వద్ద విలసిల్లిందని చెబుతున్న నాగరికతపై అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. అక్కడ కొన్ని మానవ నిర్మాణాల తాలుకు అనవాళ్లు ఉన్నాయని నిపుణులు అంగీకరిస్తున్నా, కొన్ని ఆనవాళ్లు నదుల ప్రవాహాల్లో కొట్టుకొచ్చి ఉండొచ్చుననీ చెబుతున్నారు.





