
శ్రీకాకుళం జిల్లా గార మండలం కళింగపట్నం పెద్ద పల్లిపేటలోని కోదండ రామాలయంలో ఘోర అపచారం జరిగింది. ఈ గుడిలోని బాలశశిశేఖర ఆలయం (వైష్ణవాలయం)లో గుర్తు తెలియని వ్యక్తులు ఏడు విగ్రహాలను ధ్వంసం చేశారు. దాదాపు 300 ఏళ్ల చరిత్ర గల ఈ ఆలయం గర్భగుడిని స్థానికులు విరాళాలు పోగు చేసి బాగు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా గుడి చుట్టూ దశావతారాలను సిమెంట్ విగ్రహాలతో ఏర్పాటు చేశారు. వీటిలో వామనావతరం విగ్రహాన్ని దుండగులు పూర్తిగా పెకిలించి వేశారు.
కలి్క, బలరామ, శ్రీరాముడు, పరశురామ, నరసింహ, శ్రీకృష్ణుడు విగ్రహాల చేతులు విరిగిపోయి ఉన్నాయి. కొన్ని విగ్రహాలకు కత్తి, నాగలి, పిల్లనగ్రోవి వంటివి పాడైపోయాయి. ఎవరో కావాలనే ఈ పని చేశారని అనుమానిస్తున్నారు. ఈ ఆలయానికి ఒకవైపు పిచ్చి మొక్కలు పెరిగి ఉన్నాయి. ఇక్కడ మందుబాబులు ఎక్కువగా ఉంటారని స్థానికులు చెబుతున్నారు. ఉదయం స్వీపర్ గొండు చిన్నమ్మడు వెనుక వైపు వెళ్లి చూడగా విగ్రహాలన్నీ కొన్ని చోట్ల విరిగిపోయి ఉండటం గమనించి అర్చకులకు తెలియజేసింది.
హిందూ దేవాలయాలపై ఆగని దాడులు
అర్చకులు మహేంద్రాడ లక్ష్మణమూర్తి, కోదండరామాచార్యులు, చామర్తి రామగోపాలచార్యులు ఆలయ ఈఓకు, స్థానిక పెద్దలకు తెలియజేశారు. వాళ్లు పోలీసులకు సమాచారం అందజేశారు. రెండు ఆలయాల్లోని రెండు సీసీ కెమెరాలు గత పదిహేనురోజులుగా పనిచేయడం లేదు. ఘటన జరిగిన తర్వాత విరిగిపోయిన విగ్రహాలకు వెంటనే మరమ్మతులు చేపట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది. నరసన్నపేట గ్రూప్ టెంపుల్స్ ఇన్చార్జి ఈఓ మాధవి విగ్రహాల ధ్వంసంపై గార పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
హిందూ సంఘాల నిరసన
ఆలయాన్ని శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద పరిశీలించారు. విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని గుర్తించి త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు. ఆలయం చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఒకటో పట్టణ సీఐ పైడపునాయుడు, ఇన్చార్జి ఎస్ఐ ఎం.హరికృష్ణ ఉన్నారు. జిల్లా దేవదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ పట్నాయక్ ఆలయాన్ని పరిశీలించారు. విగ్రహాల ధ్వంసంపై విశ్వహిందూ పరిషత్, భజరంగదళ్ సభ్యులు ఆలయం వద్ద నిరసన చేపట్టారు. విగ్రహాల ధ్వంసం ఘటనకు అధికారుల వైఫల్యమే కారణమని విశ్వహిందూపరిషత్, భజరంగ్దళ్ సభ్యులు ఆరోపించారు. వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు లోకనాథం ఆనందరావు, భజరంగ్దళ్ ఉత్తరాంధ్ర సంయోజక్ రావాడ రాజశేఖర్, గార మండల సంయోజక్ వంజల శ్రీనివాసరావు, భాజపా మండల అధ్యక్షురాలు మైలపల్లి లక్ష్మీజనార్దన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పండి యోగీశ్వరరావు ఆలయాన్ని సందర్శించి నిరసన తెలిపారు. దేవాదాయశాఖ ఏసీ ప్రసాద్ పట్నాయక్ను కలిసి భద్రత చర్యలు చేపట్టాలని కోరారు.





