News

భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల వేళ.. రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

223views

పహల్గామ్ ఉగ్రదాడితో భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాక్‌తో యుద్ధం తప్పదని వార్తలు వస్తున్న వేళ.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది జరిగి కచ్చితంగా జరిగి తీరుతుందంటూ తేల్చి చెప్పారు. అందుకు తాను హామీ ఇస్తున్నానన్నారు. ఢిల్లీలో జరిగిన సంస్కృతి జాగరణ్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారాయన.

‘‘మోదీ వర్కింగ్ స్టైల్, అంకితభావం గురించి అందరికీ తెలుసు. మన దేశంపై దాడి చేసిన వారికి తగిన బుద్ధి చెప్పడం నా బాధ్యత’’ అంటూ కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. భారత్‌ను దెబ్బతీయడానికి దుస్సాహసం చేసిన వారికి ధీటైన రీతిలో సమాధానం ఇస్తామంటూ వార్నింగ్‌ ఇచ్చారు. మరో వైపు, భారత్‌, పాకిస్తాన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతల వేళ.. ప్రధాని మోదీ.. జాతీయ భద్రతా సలహాదారు, ఎయిర్‌చీఫ్‌ మార్షల్‌ ఏపీ సింగ్‌తో తాజాగా సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

ఇక, సరిహద్దుల్లో ఉద్రిక్తత కారణంగా ప్రధాని మోదీ.. వరస భేటీలు అవుతున్నారు. ఇప్పటికే త్రివిధ దళాల అధికారులతో భేటీ అయ్యారు. ఇదిలా ఉండగా.. భారత్‌, పాకిస్తాన్‌ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ సైనిక దళాలకు ఆయుధాలను సరఫరా చేసే మ్యునిషన్స్‌ ఇండియా లిమిటెడ్‌కు చెందిన రెండు ఆయుధ కర్మాగారాల సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. మహారాష్ట్రలోని చంద్రపుర్‌ జిల్లా కర్మాగారంతోపాటు మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌ జిల్లా ఖమరియాలో ఉన్న ఆర్డినన్స్‌ ఫ్యాక్టరీ సిబ్బందికి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.