News

ఊదరగొట్టిన పాక్‌ చానళ్లు.. తుస్సుమనిపించిన ఐఎస్‌పీఆర్ డీజీ

332views

భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఉదయం నుంచి ఆ దేశ మీడియా సంస్థలు సాయంత్రం 6.30కు కీలక నిర్ణయం వెలువడనుందని ఊదరగొట్టాయి. ‘‘సాయంత్రం 6.30కు ఇంటర్‌ సర్వీస్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌-ఐఎస్‌పీఆర్ డీజీ అహ్మద్‌ షరీఫ్‌ చౌదరి విలేకరుల సమావేశంలో మాట్లాడుతారు. మిలటరీ సన్నద్ధత నేపథ్యంలో కీలక అంశాలను వెల్లడిస్తారు’’ అంటూ కథనాలను ప్రసారం చేశాయి. చౌదరి మీడియా సమావేశంలో మాట్లాడే దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ఐఎ్‌సపీఆర్‌ అధికారిక యూట్యూబ్‌ చానల్‌లో లైవ్‌ మొదలవ్వగానే 10 లక్షల మంది వీక్షకులు ఉండగా.. క్రమంగా వారి సంఖ్య తగ్గుతూ.. సమావేశం ముగియడానికి ఒక నిమిషం ముందు వరకు 20 వేలకు చేరుకోవడం గమనార్హం..! షరామామూలుగా పాకిస్థాన్‌లో ఉగ్రవాదాన్ని భారత్‌ ఉసిగొల్పుతోందని చౌదరి ఆరోపించారు. ఇటీవల జీలం బస్టేషన్‌ వద్ద అరెస్టయిన మాజిద్‌ అనే వ్యక్తి ఇంట్లో జరిపిన తనిఖీల్లో భారత్‌కు చెందిన డ్రోన్‌, 10 లక్షల పాకిస్థానీ రూపాయలు లభ్యమయ్యాయని.. భారత సైన్యానికి చెందిన ఓ సుబేదార్‌తో అతను మాట్లాడినట్లుగా ఆధారాలున్నాయని చెప్పారు. బలూచిస్థాన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను అంతమొందిచామని పేర్కొంటూ.. సమావేశాన్ని ముగించారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండానే అహ్మద్‌ షరీఫ్‌ చౌదరి అక్కడి నుంచి నిష్క్రమించడం గమనార్హం..!