News

సింధూ నదిలో భారతీయుల రక్తం పారుతుంది.. భారత్‌పై భుట్టో పిచ్చికూతలు..

307views

సింధు జలాల ఒప్పందం నిలిపివేయడం పాకిస్థాన్‌ను ఆగ్రహానికి గురిచేసిందని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) చీఫ్ బిలావల్ భుట్టో జర్దారీ అన్నాడు. నీటిని ఆపడానికి ప్రయత్నిస్తే భారతదేశం దాని పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని భుట్టో పేర్కొన్నాడు. సింధు నాగరికతకు పాకిస్థాన్ నిజమైన సంరక్షకులం తామే అని.. సింధూ నదిలో నీరు పారకపోతే.. భారతీయుల రక్తం పారుతుందని రెచ్చగెట్టే వ్యాఖ్యలు చేశాడు. “సింధు నది మనదే అవుతుంది. మన నీరు దాని గుండా ప్రవహిస్తుంది. లేదా వారి(భారత్) రక్తం ప్రవహిస్తుంది” అని భుట్టో బహిరంగ సభలో నోరు జారాడు.

పాకిస్థాన్, భారతదేశం మధ్య ఒక ఒప్పందం ఉందని బిలావల్ భుట్టో అన్నాడు. ఈ ఒప్పందంలో సింధు నది పాకిస్థాన్‌కు చెందుతుందని భారతదేశం పేర్కొందని వెల్లడించాడు. ఈ ఒప్పందాన్ని తాము అంగీకరించబోమని నేడు మోడీ అంటున్నారని.. దీన్ని ఎవరూ అంగీకరించరన్నారు. పాకిస్థాన్ ప్రజలు అంగీకరించరని.. భారత ప్రజలు కూడా మనపై జరుగుతున్న ఈ దారుణాన్ని సహించరని జోష్యం చెప్పాడు.

ఉగ్రవాద దాడికి భారతదేశం పాకిస్థాన్‌ను నిందించిందని భుట్టో అన్నాడు. కశ్మీర్‌లో ఉగ్రవాద దాడి జరిగిందని.. తామంతా దాన్ని ఖండించామన్నాడు. పాకిస్థాన్ ఉగ్రవాదంతో బాధపడుతోందని తాము కూడా చెప్పామని.. కానీ భారతదేశం దానికి మమ్మల్ని నిందించడం సరికాదని పేర్కొన్నాడు. మీ జనాభా ఎక్కువ, మీది పెద్ద దేశమైతే, మీరు మీ ఇష్టానుసారం ఏ నిర్ణయమైనా తీసుకుంటారా? అని పిచ్చికూతలు కూశాడు. పాకిస్థాన్ ప్రజలు గర్వంగా, ధైర్యవంతులుగా ఉంటారని.. వారి హక్కులను ఎలా కాపాడుకోవాలో వారికి తెలుసని ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు.