News

‘‘మోడీ మీ శ్వాస ఆపేస్తాం’’.. ఉగ్రవాది హఫీజ్ సయీద్ వార్నింగ్..

264views

లష్కరే తోయిబా చీఫ్, భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ పాత వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. సింధు నది జలాల ఒప్పందం రద్దు గురించి ఉగ్రవాది మాట్లాడిన వీడియోని ప్రస్తుతం పాకిస్తాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) కావాలని వైరల్ చేస్తోంది. పాక్ ప్రజల్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈ వీడియోలో సయీద్ భారత్ ప్రభుత్వాన్ని , ప్రధాని నరేంద్రమోడీని బెదిరించే ప్రయత్నం చేశాడు. ప్రధాని మోడీని బెదిరిస్తూ ‘‘ మీరు పాకిస్తాన్‌కి నీళ్లు ఆపేస్తే, మేము మీ శ్వాసను ఆపేస్తాము. నదుల్లో రక్తం ప్రవహిస్తుంది’’ అని హఫీజ్ సయీద్ వీడియోలో చెబుతుండటం చూడవచ్చు.

జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. 26 మంది అమాయక టూరిస్టుల్ని లష్కరే తోయిబా అనుబంధ ఉగ్ర సంస్థ టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఘటనపై యావత్ భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటోంది. ఈ మేరకు ఇప్పటికే భారత్ ‘‘సింధు జలాల ఒప్పందాన్ని’’ రద్దు చేసింది. పాక్ జాతీయులకు వీసాలను రద్దు చేసింది, అట్టారీ-వాఘా బోర్డర్‌ని క్లోజ్ చేసింది. రెండు దేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్న తరుణంలో, ఈ ఉగ్రవాది పాత వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.