
ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు జర్మనీ, భారత్ ద్వైపాక్షిక సహకారంతో పరస్పరం ముందుకెళ్తాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్ పర్యటనకు వచ్చిన జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ భారత ప్రధాని మోడీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతల మధ్య జరిగిన విస్తృత చర్చల అనంతరం 11 ఒప్పందాలపై సంతకాలు చేశారు. అంతరిక్షం, పౌర విమానయానం, సముద్రపు సాంకేతికత, వైద్యం, విద్య తదితర రంగాలకు సంబంధించి కీలక ఒప్పందాలు జరిగాయి. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ 2022 నాటికి నవభారత నిర్మాణ ప్రణాళికకు జర్మనీ సాంకేతిక నైపుణ్యాలు ఎంతో మేలు చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఐరాసలోని భద్రతా మండలిలో సంస్కరణలు తీసుకొచ్చే విధంగా ఇరు దేశాల సహకారం కొనసాగుతుందని చెప్పారు. తమిళనాడు, ఉత్తర్ప్రదేశ్లలోని రక్షణ కారిడార్లలో రక్షణ సంబంధ ఉత్పత్తుల్లో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జర్మనీని భారత్ కోరింది. ఈ-మొబిలిటీ, స్మార్ట్ సిటీలు, నదుల శుద్ధీకరణ, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై సహకారానికి ఉన్న అవకాశాలపైనా పరస్పరం సహకరించుకోవాలనే అంశంపై చర్చించినట్టు తెలిపారు.
అనంతరం ఏంజెలా మెర్కెల్ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు భవిష్యత్తులో టెక్నాలజీ రంగంలో మరింత పురోగతి సాధించేందుకు దోహదం చేస్తాయని ఆమె తెలిపారు. 5జీ, కృత్రిమ మేథ సవాల్గా మారాయని, వాటిపై కలిసి పనిచేయడం ముఖ్యమన్నారు. భారత్ చేపట్టిన అతిపెద్ద మౌలికవసతుల ప్రాజెక్టుల్లో పాల్గొనడం తమకెంతో సంతోషంగా ఉందని మెర్కెలా అన్నారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





