News

అయోధ్య, ప్రయాగ్‌రాజ్ తర్వాత మథుర వంతు: యోగి కీలక ప్రకటన

372views

అయోధ్యలో రామాలయ నిర్మాణం, ప్రయోగ్‌రాజ్‌లో మహాకుంభమేళా విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో ఇప్పుడు మథుర, బృందావనం సర్వతోముఖాభివృద్ధిపై దృష్టి సారించనున్నట్టు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. బర్సానాలోని శ్రీరాధా బిహారి ఇంటర్ కాలేజీలో ”రంగోత్సవ్ 2025”ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో సమూల మార్పులు చేపట్టనున్నట్టు చెప్పారు.

”బర్సానా వచ్చేవారికి తొలిసారి రోప్‌వే సౌకర్యం కల్పించాం. ఇది విజిటర్లకు వినూత్న అనుభూతిని కలిగిస్తుంది. ఇక్కడ రూ.100 కోట్లతో అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భవ్యమైన రీతీలో కాశీని పునర్నిర్మించాం. అయోధ్యను పునరుద్ధరించాం. ఇప్పుడు మధుర, బృందావన్, బర్సానా, గోవర్ధన్‌ల వంతు వచ్చింది. బీజేపీ ప్రభుత్వం ఇక్కడ యమునా జలాల ప్రక్షాళన, మౌలిక వసతుల కల్పనకు కట్టుబడి ఉంది” అని యోగి స్పష్టం చేశారు.

కాశీలో మహాశివరాత్రికి లక్షలాది మంది భక్తులు వచ్చారని, జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరూక ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాకు ఆతిథ్యం ఇచ్చిందని, అన్ని రికార్డులను మహాకుంభ్ తిరగరాసిందని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఈ ప్రాంతంలో హోలికి ఎంతో ప్రాధాన్యత ఉందని, ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తు్న్నానని అన్నారు. హోలిని ఐక్యతా పండుగగా ఆయన అభివర్ణించారు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వంతో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందని చెప్పారు.