News

వెంకటాపురం నుంచే శ్రీశైలం పాదయాత్రకు అనుమతి

416views

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు శ్రీశైల దివ్యక్షేత్రానికి నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్‌ వెంకటాపురం నుంచి మాత్రమే భక్తులు పాదయాత్రగా వెళ్లాల్సి ఉంటుందని ప్రాజెక్ట్‌ టైగర్‌ ఆత్మకూరు డివిజన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ వి సాయిబాబా తెలిపారు. ఆత్మకూరు పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాదయాత్ర కోసం కొందరు వాహనాల్లో బైర్లూటి వరకు వచ్చి అక్కడ నుంచి నాగలూటికి పంపాలని డిమాండ్‌ చేస్తున్నారని, అలా అనుమతించబోమన్నారు. వెంకటాపురం నుంచి నల్లమల అటవీ మార్గంలో పల్లెకట్ట, నాగలూటి, దామెర్లకుంట, తాపలరస్తా, పెచ్చెర్వు, భీముని కొలను, కై లాసద్వారం, హఠకేశ్వరం తదితర పది చోట్ల తమ సిబ్బందితో తాగునీరు, ఉచిత వైద్య సేవలు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ఉచిత అన్నదాన శిబిరాలు కూడా కొనసాగుతాయన్యానరు. అటవీ మార్గంలో భక్తులు పాటించాల్సిన జాగ్రత్తలను ఫ్లెక్సీల రూపంలో ఉంచుతున్నామన్నారు. ఇప్పటికే లౌడ్‌ స్పీకర్లతో కూడా ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. పాదయాత్ర మార్గంలో జంగిల్‌ క్లియరెన్స్‌ చేశామని ఆయన పేర్కొన్నారు. భక్తులు ప్లాస్టిక్‌ కవర్లను అడవిలోకి తీసుకురాకుండా జాగ్రత్త పడాలన్నారు. రాత్రి పూట అడవిలో ప్రయాణించరాదన్నారు.