News

కాశీలోనూ కుంభమేళా ఉత్సాహం.. పోటెత్తనున్న భక్తులు

227views

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుంచి మహాకుంభమేళా జరగనుంది. ఇప్పుడు కుంభమేళా ఉత్సాహం వారణాసి(కాశీ)లోనూ కనిపిస్తోంది. కుంభమేళాకు తరలివచ్చే భక్తులు తప్పక వారణాసికి కూడా వస్తారని స్థానిక అధికారులు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో పలు ఏర్పాట్లు చేస్తున్నారు.

కుంభమేళాకు వచ్చే లక్షలాది మంది యాత్రికులు సంగమ స్నానం ముగించుకున్నాక నేరుగా వారణాసికి వచ్చి, గంగలో స్నానం చేసి విశ్వనాథుని దర్శనం చేసుకుంటారు. ఈ విధంగా చూస్తే కుంభమేళా సందర్భంగా కాశీకి వచ్చే యాత్రికుల సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. కుంభమేళా రోజుల్లో విశ్వనాథుని దర్శనం కోసం వచ్చే భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ స్వామివారి దర్శన సమయాల్లో మార్పులు చేసింది. 2024 జనవరి 13 నుండి ఫిబ్రవరి 12 వరకూ విశ్వనాథుని ఐదు హారతులతో కూడా మార్పులు చేసింది.

జనవరి 13 నుండి ఫిబ్రవరి 26వ తేదీ వరకు సాధారణ రోజులలో మంగళ హారతి సమయం తెల్లవారుజాము 2.45, భోగ్ హారతి ఉదయం 11.35, సప్తఋషి హారతి రాత్రి 7.00, శృంగర్-భోగ్ హారతి రాత్రి 8.45, శయన హారతి రాత్రి 8.45కు నిర్వహించనున్నారు. మహా కుంభమేళా సమయంలో అంటే జనవరి 20, 27, ఫిబ్రవరి 3, 10, 17, 24 తేదీలలో శృంగార-భోగ్ హారతి రాత్రి 9 గంటలకు, శయన హారతి రాత్రి 10.45 గంటలకు నిర్వహించనున్నారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కాశీ విశ్వనాథ్ ధామ్‌లో పౌర్ణమి రోజు ఇచ్చే హారతి వేళల్లోనూ మార్పులు చేశారు. జనవరి 13, ఫిబ్రవరి 12 తేదీలలో బాబా విశ్వనాథుని సప్తఋషి హారతి సాయంత్రం 6.15 గంటలకు ప్రారంభమవుతుంది, శృంగార-భోగ్ హారతి సాయంత్రం 6.15 గంటలకు, తిరిగి రాత్రి 8 గంటలకు జరుగుతుంది. మంగళ హారతి, మధ్యాహ్న భోగ్ హారతి, శయన హారతి సమయాలలో ఎటువంటి మార్పులు ఉండబోవు.

మహాకుంభమేళా.. మహాశివరాత్రి(ఫిబ్రవరి 26)తో ముగియనుంది. ఆ రోజున విశ్వనాథుని దర్శనం, పూజల కోసం నాగా సాధువులు, అఖాడాలే కాకుండా పెద్ద సంఖ్యలో భక్తులు కూడా తరలి వస్తారు. ఆ రోజున తెల్లవారుజామున 2.15 గంటలకు ఆలయ తలుపులు తెరుస్తారు. మధ్యాహ్నం జరిగే భోగ్ హారతి 11.35 గంటలకు ప్రారంభమై 12.35 వరకు కొనసాగనుంది. మహాశివరాత్రి నాటి రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6.30 గంటల వరకు నాలుగు గంటలపాటు హారతి కార్యక్రమం ఉంటుంది.