
పాట్నాలో అకస్మాత్తుగా ఉత్పన్నమైన వరద పరిస్థితులలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ కార్యకర్తలు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. ఇప్పటివరకు స్వయంసేవకులు 100 కుటుంబాలని, 60 మంది బాలబాలికలను ఆపద నుండి రక్షించారు. స్వయంసేవకులు నాలుగు ప్రాంతాలలో తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేశారు. అందులో భూతనాథ్ రోడ్డు, మున్నా చౌక్, డాక్టర్స్ గోలంబర్, వైశాలి గోలంబర్ లు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో 150 మంది స్వయంసేవకులు 12 బృందాలుగా ఏర్పడి పని చేస్తున్నారు. 10 బృందాలు సహాయక కార్యక్రమాలను, రెండు బృందాలు రక్షణ పనులలోను నిమగ్నమై ఉన్నారు.
ఈ మొత్తం కార్యక్రమం క్షేత్ర ప్రచారక్ శ్రీ రామదత్త చక్రధర్, కార్యవాహశ్రీ మోహన్ సింహ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. స్వయం సేవకులు గత రెండు రోజులలో పదివేల భోజనం ప్యాకెట్లు, నాలుగు వేల బ్రెడ్ ప్యాకెట్లు, రెండు వేల లీటర్ల పాలు, వంద ప్యాకెట్ల కొవ్వొత్తులు, పది కార్టూన్ల బిస్కట్లు, పది డబ్బాల టాఫీలు వితరణ చేశారు. ప్రాంత ప్రచార ప్రముఖ్ శ్రీ రాజేష్ పాండ్యా మాట్లాడుతూ పాట్నాలో ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో నీరు నిలిచి ఉందని అన్నారు. ఈ కారణం వల్ల వ్యాధులు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉందని, దీని నివారణకు ప్రత్యేక వైద్య బృందాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.





