
ప్రార్థనా మందిరాల కూల్చివేతకు బీజేపీ ఆదేశాలిచ్చిందంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి ఇటీవల చేసిన ఆరోపణలపై బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ ప్రభుత్వం 2016-2023 మధ్య 24 ఆలయాలను కూల్చేసిందని ప్రత్యారోపణ చేసింది. ఆలయాలను కూల్చేందుకు కేజ్రీవాల్ “ఫత్వాలు” జారీ చేసినట్టు బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాల్ చెప్పారు.
“మీడియా ద్వారా పబ్లిక్ డొమైన్లో ఉన్న డాక్యుమెంట్లు చూస్తే దేశాన్ని, ప్రంపచాన్ని మోసం చేసిన పార్టీల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మించిన పార్టీ లేదని అర్ధమవుతుంది. ఇతరుల విమర్శిస్తున్న వారి సొంత చరిత్ర ఏమిటి? 2016 నుంచి 2023 వరకూ సంతకాలతో కూడిన డాక్యుమెంట్లు చూస్తే సుమారు 24 కట్టడాలను కూల్చేసేందుకు ఆప్ ముఖ్యమంత్రి, మంత్రులు ఫత్వాలు జారీ చేసినట్టు స్పష్టమవుతుంది” అని పూనావాలా అన్నారు. 2016లో 8 ఆలయాలను కూల్చేందుకు అప్పటి హోం మంత్రి సత్యేంద్రజైన్ సంతకంతో ఆదేశాలు ఇచ్చారని, కానీ ఎలాంటి చారిత్రక ప్రాధాన్యత లేని రెండు మసీదులను పరిరక్షించేందుకు ఆయన జోక్యం చేసుకున్నారని అన్నారు. ఆలయాల గురించి ఆయన ఎప్పుడూ మాట్లాడిందే లేదన్నారు.
హిందూ వ్యతిరేక పార్టీ
దేశంలోనే ‘ఆప్’ అతిపెద్ద హిందూ వ్యతిరేక పార్టీ అని పూనావాలా విమర్శించారు. ఆప్ భాగస్వా్మ్య పార్టీలైన డీఎంకే, టీఎంసీ, వామపక్షాలు, కాంగ్రెస్ ఎప్పుడూ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడతారని, దీనిపై ఆప్ మాత్రం స్పందించదని, ఇప్పుడు పూజారులకు పరిహారం ఇస్తామని ఆప్ మాట్లాడుతోందని అన్నారు.
అతిషి ఏమన్నారు?
దేశ రాజధానిలో పలు ఆలయాలు, ఒక బౌద్ధాలయం కూల్చివేతకు బీజేపీ ఆదేశాలిచ్చినట్టు ముఖ్యమంత్రి అతిషి జనవరి 1న ఆరోపించారు. నవంబర్ 22న జరిగిన రెలిజియస్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఒకవైపు హిందూయిజాన్ని కాపాడతామని బీజేపీ చెప్పుకుంటూ, మరోవైపు రహస్యంగా ఆలయాల కూల్చివేతకు స్వయంగా తామే ఏర్పాటు చేసుకున్న అధికారులకు, ఎల్జీకి ఆదేశాలిస్తోందని విమర్శించారు.





