News

పాక్‌లో తెరుచుకున్న భగత్‌సింగ్‌ గ్యాలరీ

279views

పాకిస్థాన్‌లోని పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి విఖ్యాత పూంఛ్‌హౌస్‌లోని భగత్‌సింగ్‌ గ్యాలరీని సందర్శకులకు అందుబాటులోకి తెచ్చింది. ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జాహిద్‌ అఖ్తర్‌ జమన్‌ సోమవారం ఈ గ్యాలరీని తెరిచారు. అందులో భగత్‌ సింగ్‌ ఫోటోలు, లేఖలు, నాటి వార్తాపత్రికలు, భగత్‌ జీవిత విశేషాలు, ఆయన గురించి ప్రచురితమైన స్మారక వ్యాసాలు, భగత్‌సింగ్‌ బృంద విచారణ వివరాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. పూంఛ్‌ హౌస్‌ను మళ్లీ పూర్వరూపంలోకి తెచ్చామని ఈ సందర్భంగా జమన్‌ చెప్పారు. స్వాతంత్య్రం కోసం భగత్‌సింగ్‌ పోరాటాన్ని అందులోని గ్యాలరీ కళ్లకు కడుతుందన్నారు. బ్రిటిష్‌ పాలకులు భగత్‌సింగ్‌ను 23 ఏళ్ల వయసులో ఉరికంబం ఎక్కించారు. వలస ప్రభుత్వంపై కుట్ర పన్నాడని ఆరోపించి, 1931 మార్చి 23న లాహోర్‌ జైలులో ఉరి శిక్ష అమలు చేశారు.