
హైందవ ధర్మానికి మూలబిందువులైన శ్రద్దాకేంద్రాలు, భజనలు, నగర సంకీర్తనలు అని మరుగున పడిపోతున్న నేటి కాలంలో ధర్మ జాగరణ సమితి తనదైన శైలిలో ప్రముఖ దేవాలయాల వద్ద, ఉపేక్షిత వాడలలో, బస్తీల్లో హరినామం కీర్తిస్తూ వీధులవెంట నగర సంకీర్తన చేస్తూ ప్రజల్లో భక్తి భావనను తద్వార ధర్మాన్ని జాగృతం చేస్తున్నది.
నెల్లూరు జిల్లా కొండ బిట్రగుంటలో…

ధర్మజాగరణ సమితి కావలి డివిజన్ ఆధ్వర్యంలో కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి సన్నిధిలో 5వ నగర సంకీర్తన కార్యక్రమం అంగరంగవైభవంగా జరిగింది. కావలి పరిధిలోని 12 మండలాల నుంచి సుమారు 4000 మంది భజన మండలి సభ్యులు ఈ నగర సంకీర్తన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈకార్యక్రమనికి ముఖ్య వక్తగా విచ్చేసిన ఆర్.ఎస్.ఎస్.ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ మాట్లాడుతూ మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలను గ్రామ గ్రామానికి ఇంటింటికీ తీసుకు వెళ్లాలని చెప్పారు. అన్యమత ప్రచారానికి, మాయమాటలకు మోసపోవద్దని హిందూ బంధువులందరినీ హెచ్చరించారు. హిందూ ధర్మం ద్వారానే లోక కల్యాణం జరుగుతుందని, ధర్మజాగరణ కార్యకర్తలైన మనమంతా హిందూ ధర్మాన్ని ప్రచారం చేయాలని, క్రైస్తవ మతమార్పిడిలు మన గ్రామాలలో జరగకుండా క్రైస్తవ మత ప్రచారాన్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమానికి బ్రహ్మంగారి మఠం తోటపల్లి ఆచలానంద ఆశ్రమం నుండి విచ్చేసిన స్వామి విరిజానంద మాట్లాడుతూ భజన మండలి సభ్యులమైన మనం కేవలం భజన మాత్రమే కాకుండా హిందూ ధర్మం యొక్క ఔన్యత్యాన్ని ప్రతి ఒక్కరికీ తెలియజేసి సేవచేసే గుణం అలవర్చుకోవాలని, సమాజ సేవ ద్వారానే మనవసేవ జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శుభమస్తు షాపింగ్ మాల్ అధినేత శ్రీ బయ్యావాసు, సామాజిక కార్యకర్త శ్రీమతి ముదికొండ పద్మ సుష్మ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రాంత ధర్మజాగరణ సహ సంయోజకులు శ్రీ కొండూరు ఈశ్వరయ్య , నెల్లూరు విభాగ్ ధర్మజాగరణ ప్రముఖ్ శ్రీ పేరిశెట్ల రమణయ్య, కావలి జిల్లా ధర్మజాగరణ ప్రముఖ్ శ్రీ కడియాల వెంకయ్య మరియు ధర్మజాగరణ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కర్నూలు జిల్లా నంద్యాలలో…

అలాగే ఆదివారం ఉదయం కర్నూలు జిల్లా, నంద్యాలలోని స్థానిక విశ్వనగర్ లో ధర్మజాగరణ కార్యకర్తలు శ్రీ మల్లిఖార్జున గారు, శ్రీ పురుషోత్తం గారు, శ్రీ రామాచారి గారు స్థానిక హిందూబందువులతో పాటు మాతృమూర్తులను కూడా కలుపుకుని నగర సంకీర్తనం చేశారు.






