News

జామా మసీదు అక్రమ కట్టడంపై బుల్డోజర్ యాక్షన్

245views

యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరోసారి బుల్డోజర్ యాక్షన్ కు దిగింది. ఫతేపూర్‌ జిల్లాలోని నూర్ జామా మసీదు విస్తరణలో భాగంగా నిర్మించిన అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేశారు. డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకిగా అక్రమ నిర్మాణం జరిగినందున మసీదులోని కొంతభాగాన్ని కూల్చేసినట్టు అధికారులు తెలిపారు. రెండుసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ మసీదు కమిటీ నుంచి స్పందన లేదని, మసీదు విస్తరణ పేరుతో గత మూడేళ్లగా ఈ అక్రమ కట్టడాలను నిర్మించారని జిల్లా అధికారి ఒకరు తెలిపారు.

జామా మసీదులోని ఆక్రమిత నిర్మాణాల కూల్చివేత సందర్భంగా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. అదనపు జిల్లా మెజిస్ట్రేట్ అవినాష్ త్రిపాఠి, ఎస్ఎస్‌పీ విజయశంకర్ మిస్రా సహా పలువురు సీనియర్ అధికారుల సమక్షంలో కూల్చివేతలు చేపట్టారు. ముందస్తు చర్యగా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. కాగా, పీడబ్ల్యూడీ శాఖ సర్వే జరిపి, అక్రమ నిర్మాణాలు చేపట్టిన యజమానులందరికీ నోటీసులు ఇచ్చిందని, ఆక్రమణలకు సంబంధించి సెప్టెంబర్ 24న మసీదు కమిటీకి కూడా నోటీసులు జారీ అయ్యాయని పోలీసులు తెలిపారు. మసీదు కమిటీతో సహా 133 భవానాలు, రోడ్డుపై నున్న దుకాణాలకు నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. మసీదు కమిటీ నెలరోజులు గడువు అడిగిందని, అది కూడా ముగియడంతో అధికారులు ఆక్రమణల తొలగింపు పనులు చేపట్టారని చెప్పారు. జిల్లాలో శాంతి భద్రతల పరిస్థితి అదుపులో ఉన్నట్టు తెలిపారు.

మసీదు కమిటీ అభ్యంతరం
కాగా, మసీదులోని కొంత భాగాన్ని కూల్చివేయడం ద్వారా అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను పోలీసులు ఉల్లంఘించారని నూర్ జామా మసీదు కమిటీ పేర్కొంది. మసీదు కమిటీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిందని, డిసెంబర్ 13న పిటిషన్ విచారణకు రానుందని చెప్పారు. అయితే దీనికి ముందే ప్రార్థనా మందిరంలోని కొంత భాగం కూల్చివేయడం కోర్టు ఆదేశాల ఉల్లంఘన కిందకే వస్తుందని మసీదు కమిటీ సెక్రటరీ సైయద్ నూరి తెలిపారు.