ArticlesNews

ప్రపంచానికి మార్గదర్శకంగా భగవద్గీత : ఉపరాష్ట్రపతి

228views

భగవద్గీత యావత్ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తోందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ అన్నారు. అంతర్జాతీయ గీతా మహోత్సవం సందర్భంగా హర్యానాలోని కురుక్షేత్రలోని గీతాజ్ఞాన సంస్థానం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ప్రసంగించారు.భగవద్గీత యొక్క సారాంశాన్ని , సానుకూల ఆలోచనను సామరస్య సందేశాన్ని అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. సామాజిక క్రమశిక్షణ , శాంతి, అభివృద్ధి, సోదరభావం, పురోగతి, ఆనందానికి భగవద్గీత సూత్రాలు చాలా అవసరమని పేర్కొన్నారు .

ప్రతి ఒక్కరూ గీతా సారాన్ని అవలంబించాలని, సానుకూల ఆలోచనతో దేశ ప్రగతికి సహకరించాలని కోరారు. గీతా బోధనల స్ఫూర్తితో “పంచామృత నమూనా” పాలన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. “ప్రతి పౌరుడు ఇతరులపై ఆధారపడకుండా స్వీకరించగల ఈ పవిత్ర స్థలం నుండి నేను ఏమి సందేశం ఇవ్వగలనని లోతుగా ఆలోచించానని, . ” గీత నుండి ఐదు ప్రాథమిక సూత్రాలను ప్రతిపాదిస్తున్నానని , దీనిని పంచామృతం అని పిలవాలని” తెలిపారు

మొదటి సూత్రం నిర్మాణాత్మక సంభాషణ: “విభేదాలు వివాదాలు కాకూడదని శ్రీ కృష్ణుడు, అర్జునుడి మధ్య సంభాషణ మనకు బోధిస్తుందని చెప్పారు. ప్రజలు భిన్నంగా ఆలోచిస్తారు కాబట్టి విభేదాలు సహజం.కాబట్టి నిర్మాణాత్మకమైన సంభాషణపై అందరూ దృష్టి సారించాలని, వ్యక్తిగత ప్రయోజనాలను కాకుండా ప్రజా ప్రయోజనాలను అందించాలని సూచించారు.

రెండవ సూత్రం వ్యక్తిగత చిత్తశుద్ధి : బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు, పరిపాలన, రాజకీయాలు లేదా ఆర్థిక శాస్త్రంలో ఎవరైనా ఆదర్శంగా ఉండాలి. వారి ప్రవర్తన ప్రజలను ప్రేరేపించాలి, ఎందుకంటే ఇది సమాజంపై లోతైన ప్రభావం చూపుతుందని తెలిపారు

మూడవ సూత్రం నిస్వార్థమైన అంకితభావం : ‘యజ్ఞార్థ కర్మణో’ అని శ్రీకృష్ణుడు బోధిస్తున్నాడు – పని వ్యక్తిగత ప్రయోజనం కోసం కాదు, విస్తృత ప్రయోజనం కోసం, ఈ స్ఫూర్తితో 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడం కోసం , దేశ సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ ఈ సమిష్టి కృషికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

నాల్గవ సూత్రం కరుణ : కరుణ అనేది మన 5,000 ఏళ్ల సంస్కృతి యొక్క సారాంశం. COVID-19 సంక్షోభ సమయంలో, భారతదేశం, దాని స్వంత సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, ఎక్కువ మందికి వ్యాక్సిన్‌లను అందించడం ద్వారా కరుణ స్ఫూర్తిని ప్రదర్శించింది. సముద్రంలో చిక్కుకుపోయిన నౌకలను రక్షించడంలో, యుద్ధ సమయంలో విద్యార్థులను తరలించడంలో లేదా భూకంపాలు మరియు కరువుల వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయం అందించడంలో భారతదేశం ఎల్లప్పుడూ ముందంజలో ఉంది. ఈ కనికరం ప్రతి ఒక్కరి జీవితంలో స్థానం పొందాలని ఆకాంక్షించారు.

ఐదవ సూత్రం పరస్పర గౌరవం : పోటీ అవసరం, కానీ అది వివాదానికి దారితీయకూడదు. నేడు శత్రువులు లేరు – విభిన్న దృక్కోణాలు మాత్రమే. ఈ వైవిధ్యం మన దేశానికి ముఖ్యమైనది. దేశంలో వైవిధ్యాన్ని పరిగణిస్తే అ వన్నీ ఏకత్వానికి దారితీస్తాయని తెలిపారు.