
మహాకుంభమేళాను పురస్కరించుకుని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) సరికొత్త టూర్ ప్యాకేజీకి శ్రీకారం చుట్టింది. కుంభమేళాను వీక్షించటంతో పాటు పవిత్ర పుణ్యక్షేత్రాలను సందర్శించుకునేలా ‘మహా కుంభ్ పుణ్య క్షేత్ర యాత్ర – 2025 ’ పేరుతో ఏడు రాత్రులు, 8 పగళ్లు సాగేలా టూర్ ప్యాకేజీకి శ్రీకారం చుట్టింది. వారణాసిలో కాశీ విశ్వనాథఆలయం, కాశీ విశాలక్షి, అన్నపూర్ణాదేవి ఆలయాల సందర్శనతో పాటు సాయంత్రం గంగా హారతిని వీక్షించాక ఆయోధ్య తీసుకెళతారు. సరయు నది దగ్గర ఉన్న రామజన్మభూమి ప్రాంతం, హనుమాన్ గర్హి, ఆరతిలను సందర్శిస్తారు. చివరిగా ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం దగ్గర జరిగే కుంభమేళా వీక్షణ, పవిత్ర స్నానాలు ఆచరించాక తిరుగు ప్రయాణం ఉంటుంది. యాత్ర ప్యాకేజీ సికింద్రాబాద్ నుంచి ప్రారంభమవుతున్నా ప్రత్యేక రైలు విజయవాడ వస్తుంది. విజయవాడ నుంచి బుక్ చేసుకున్న వాళ్లంతా ఇక్కడి నుంచే బయలుదేరవచ్చు. ప్రత్యేక రైలు జనవరి 19న విజయవాడ వస్తుంది. యాత్ర జనవరి 25 వరకు కొనసాగుతుంది.
టూర్ ప్యాకేజీ టారిఫ్
టూర్ ప్యాకేజీ ఎకానమీ, స్టాండర్డ్, కంఫర్ట్ కేటగిరీలుగా ఉంటుంది. ఎకానమీలో స్లీపర్ క్లాస్ ఉంటుంది. పెద్దలకు రూ.22,635, పిల్లలకు రూ.21,740. నాన్ ఏసీ రూములు, నాన్ ఏసీ వాహన సదుపాయం ఉంటుంది. స్టాండర్డ్ కేటగిరీలో 3 ఏసీ, పెద్దలకు రూ.31,145, పిల్లలకు రూ.30,095. ఏసీ రూములు, నాన్ ఏసీ వాహన సదుపాయం ఉంటుంది. కంఫర్ట్ క్యాటగిరీలో 2 ఏసీ, రూ.38,195, పిల్లలకు రూ.36,935. ఏసీ రూములు, ఏసీ వాహన సదుపాయం కల్పిస్తారు.
ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం
ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాం. సహాయం చేయటానికి మా మేనేజర్లు ఉంటారు. ప్రయాణ బీమా, ఎస్కార్ట్ సేవలు అదనం. యాత్రికులకు ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనాలు పూర్తి శాఖాహారం అందిస్తాం. 92814 95860, 92814 95848, 89773 14121కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
– ఎం రాజా, మేనేజర్, ఐఆర్సీటీసీ





