News

ఇస్కాన్‌ కేంద్రానికి నిప్పు ; బంగ్లాదేశ్‌లో నిరసన మూకల దుశ్చర్య

225views

బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. రాజధాని ఢాకాలోని ఓ ఇస్కాన్‌ కేంద్రానికి శనివారం వేకువజామున గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టారు. ధౌర్‌ గ్రామంలోని నమ్‌హట్టా ప్రాంతంలో ఉన్న శ్రీ రాధా కృష్ణ ఆలయం, శ్రీ మహాభాగ్య లక్ష్మీ నారాయణ ఆలయాలపై ఈ దాడి జరిగిందని ఇస్కాన్‌ కోల్‌కతా ఉపాధ్యక్షుడు రాధారమణ్‌ దాస్‌ ‘ఎక్స్‌’లో వెల్లడించారు.

పెట్రోల్‌ పోసి నిప్పంటించడంతో శ్రీ లక్ష్మీ నారాయణ విగ్రహంతోపాటు అన్ని వస్తువులు పూర్తిగా కాలిపోయాయన్నారు. హిందూమత పెద్ద చిన్మయ్‌ కృష్ణ దాస్‌ బెయిలివ్వకుండా జైలులో ఉంచారంటూ…ఆయన భద్రతపై రాధారమణ్‌ దాస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇస్కాన్‌ అనుయాయులు బయట తిరిగేటప్పుడు ముందు జాగ్రత్తగా నుదుటన తిలకం ధరించవద్దని కోరారు. మైనారిటీలకు భద్రత కల్పిస్తామని యూనస్‌ సారథ్యంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఎక్కడా అమలు కావడం లేదని రాధారమణ్‌ దాస్‌ ఆవేదన వ్యక్తం చేశారు.