News

పార్లమెంట్‌ కాంప్లెక్స్‌లో ‘ది సబర్మతి రిపోర్ట్‌’ను వీక్షించనున్న మోదీ

198views

గుజరాత్‌ అల్లర్లు, గోద్రా రైలు దహన కాండను ఆధారంగా చేసుకొని తెరకెక్కిన తాజా హిందీ చిత్రం ‘ది సబర్మతి రిపోర్ట్‌’. ఈ చిత్రాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు(సోమవారం) వీక్షించనున్నారు. పార్లమెంట్‌ కాంప్లెక్స్‌లోని బాలయోగి ఆడిటోరియంలో సాయంత్రం ప్రత్యేక స్క్రీనింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ స్క్రీనింగ్‌కు ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సహా పలువురు సభ్యులతో మోదీ ఈ చిత్రాన్ని చూడనున్నారు. మోదీతో పాటు విక్రాంత్‌ మాస్సే, చిత్ర నిర్మాత ఏక్తా కపూర్ కూడా చిత్రాన్ని వీక్షించనున్నారు.

ఫిబ్రవరి 27, 2002న జరిగిన గోద్రా రైలు దహనం సంఘటన ఆధారంగా రూపొందించిన ది సబర్మతి రిపోర్ట్‌’లో నటులు విక్రాంత్ మాస్సే, రిధి డోగ్రా, రాశి ఖన్నా ప్రధాన పాత్రాలుగా నటించారు. బాలీవుడ్‌ దర్శకుడు ధీరజ్‌​ సర్నా తెరకెక్కించగా.. ఏక్తా కపూర​ నిర్మించారు. నవంబర్‌ 15న ఈ సినిమా విడుదలైంది.

కాగా పంచమహల్‌ జిల్లాలోని గోద్రా పట్టణంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌కు కొందరు దుండగులు నిప్పు పెట్టడంతో 59 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో గుజరాత్‌లో మతపరమైన అల్లర్లు చెలరేగాయి. దాదాపు 1,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఎక్కువగా ముస్లింలు ఉన్నారు. కాగా ఆ సమయంలో ప్రధాని మోదీ గుజరాత్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు.